చంపేసి మావోలపైకి నెట్టే కుట్ర: దాడి భయంతో ప్రచారం నిలిపేసిన రేవంత్ రెడ్డి
Recommended Video
కొడంగల్/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణహానీ ఉందని చెప్పిన విషయం తెలిసిందే. తనపై మావోయిస్టుల ముసుగులో దాడికి కుట్రపన్నారని ఆరోపించారు.
రేవంత్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. రాజకీయంగా తన హోదా పెరిగినా భద్రతను తగ్గించారని ఆయన శుక్రవారం వాపోయారు. అవినీతి అక్రమాలపై పోరాడుతున్న తనను అడ్డు తొలగించుకుంటామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారని అన్నారు. రాష్ట్రంలో తన ఎన్నికల ప్రచార పర్యటనను అడ్డుకుంటున్నారన్నారు.
షాకింగ్: 'జూ.ఎన్టీఆర్ రాకుండా చంద్రబాబు కుట్ర! అందుకే లోకేష్ బదులు సుహాసిని'
ప్రాణహానీ ఉందని చెప్పినా పట్టించుకోరా?
తన కార్యకర్తలపై దాడులు పెరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో 4+4తో తనకు భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తనకు భద్రతను ఎందుకు తగ్గించారని నిలదీశారు. తనకు ప్రాణహానీ ఉందని పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.
నన్ను చంపేసి మావోయిస్టులపైకి నెట్టే కుట్ర
మహేందర్ రెడ్డి డీజీపీ అయ్యాక కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు తనకూ వేధింపులు పెరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నందునే తనను అంతమొందించేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. నక్సల్స్ ఏరివేతలో పాల్గొంటున్న కొందరు పోలీసు అధికారులను ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తనను చంపేసి దానిని మావోయిస్టుల పైకి నెట్టివేసేందుకు కుట్ర పన్నారన్నారు.
దాడుల భయంతో ప్రచారం రద్దు
ఇలాంటి పరిస్థితుల్లోనే తాను ఖమ్మం జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్లు రేవంత్ తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చెప్పినప్పటికీ కేసీఆర్ ఒత్తిడితో కేంద్రం భద్రతను కేటాయించడం లేదని ఆరోపించారు. హైకోర్టు చెప్పినా వినలేదన్నారు. తనపై దాడులు జరగవచ్చుననే భయంతో ప్రచారం రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ రెడ్డి
తనకు ప్రాణహానీ ఉందంటూ రేవంత్ మరోసారి హైకోర్టుకు వెళ్లారు. తనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ డివిజన్ బెంచ్లో పిటిషన్ వేశారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేసిందని చెప్పారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని చెబితే కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.