ఇంకానా: రేవంత్రెడ్డి కౌంటర్, చంద్రబాబును అంటే: కవితకు హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంకా ఆంధ్రా అంటూ సెంటిమెంటుతో పాలన సాగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. అది సరికాదన్నారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లోకసభలో తప్పు పట్టడం టిఆర్ఎస్ ఎంపీలకు సరికాదన్నారు. హైకోర్టు విభజనకు చంద్రబాబు వ్యతిరేకం కాదని చెప్పారు. పాలన ఏపీకి తరలిపోయే అంశం పైన కూడా ఆయన స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సిఎం ఎన్నో చెప్పారని ఆయన ఇప్పటి వరకు ఏం చేశారని అభిప్రాయపడ్డారు. ఓయులో పేదలకు ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉస్మానియా ఆసుపత్రి.. ఇలా ఎన్నో చెప్పారని కానీ ఏం చేశారని ప్రశ్నించారు.
కవితకు హెచ్చరిక: ఎల్ రమణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గురువారం హెచ్చరించారు. చంద్రబాబు పైన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆమె క్షమాపణలు చెప్పాలన్నారు.
తండ్రి, బిడ్డలు కాలగర్భంలో కలిసే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ. లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామేశ్వర రావుకు రూ.1000 కోట్ల విలువైన భూములు కేటాయించిన కెసిఆర్ ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు మాత్రం చెల్లించడం లేదన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో బిజెపితో కలిసి వెళ్తామని చెప్పారు.
మాదిగలకు అన్యాయం చేస్తే తిరుగుబాటు: మందకృష్ణ
మాదిగలకు అన్యాయం చేస్తే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పైన తిరుగుబాటు తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గురువారం హెచ్చరించారు.
ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకు వెళ్లి వర్గీకరణకు కృషి చేస్తానని కడియం శ్రీహరి చెప్పారని, దానిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తన కూతురు పోటీపై కడియం స్పష్టత ఇవ్వాలన్నారు. మాదిగలకు అన్యాయం చేస్తే కడియంపై తిరుగుబాటు తప్పదన్నారు.