ఎమ్మెల్యేల మెడపై కత్తిపెట్టి, బెదిరిస్తున్నారు: జంపింగ్లపై రేవంత్ ఫైర్
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పైన కత్తి పెట్టి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, తెలంగాణ టిడిపి ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి మంగళవారం దుమ్మెత్తి పోశారు.
వారు ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల పైన పార్లమెంటులో చట్టం తేవాల్సి ఉందని చెప్పారు. ఒత్తిడి చేసి ఎమ్మెల్యేలను లొంగ తీసుకుంటున్నారని, పార్టీ మారకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారని, ఇలా చేస్తే భవిష్యత్తులో కెసిఆర్కు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ ఎల్ రమణ అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం టిడిపి కట్టుబడి ఉందని చెప్పారు. కెసిఆర్ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి గెలుపొందాలని అన్నారు.
కెసిఆర్ విపరీత పోకడలతో ముందుకు పోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో గెలుపొందాలనుకోవడం, ప్రత్యర్థులను ఓడించాలనుకోవడాన్ని ఎవరూ తప్పుబట్టరన్నారు. అయితే, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చేర్చుకుంటూ.. ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహించిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారన్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన మాధవరం కృష్ణా రావు, ధర్మారావు, తీగల కృష్ణా రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలను బ్లాక్ మెయిల్ చేసి లొంగతీసుకున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కెసిఆర్ కుట్ర చేస్తోందన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్యాపారాల విషయంలో ఒత్తిడి తెచ్చి చేర్చుకుంటున్నారన్నారు. రాజకీయ పునరేకీకరణ, అభివృద్ధి అని కెసిఆర్ చెబుతున్నదంతా వట్టిదే అని అభిప్రాయపడ్డారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లొంగదీసుకున్నారన్నారు. మొన్నటికి మొన్న తమ పార్టీకి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వ్యాపారాల గురించి మంత్రి కెటిఆర్ హెచ్చరించారన్నారు. ఎమ్మెల్యేల పైన ఒత్తిడి చేసి లొంగదీసుకుంటున్నారన్నారు.
ఈ రోజు కెసిఆర్ వ్యవహార శైలి తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉందన్నారు. మిగతా పార్టీలు లేకుండా చేయాలుకుంటున్న కెసిఆర్! చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తమ పార్టీ శాసన సభ్యుల మెడ పైన కత్తి పెట్టి లొంగతీసుకుంటున్నారన్నారు.
ప్రజాస్వామ్యవాదులు ఇప్పటికైనా స్పందించాలన్నారు. కెసిఆర్కు పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ తమ పార్టీ వారిని లొంగతీసుకోవడం సరికాదన్నారు. పార్టీ మారకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ రోజు అవసరమనుకుంటే పార్లమెంటులో చట్ట సవరణ కూడా చేయాల్సి ఉందన్నారు. కెసిఆర్ చేస్తున్నదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు.
కెసిఆర్ మైండ్ గేమ్ పాలన సాగిస్తున్నారని రమణ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతామన్నారు. వివేక్ పార్టీ మారడం బాధాకరమన్నారు. తాను తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఖండించారు. తన పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు టిడిపిని వీడే ఆలోచన లేదన్నారు.