జాతీయగీతం: చెప్పలేదని తెరాసపై టీడీపీ, కాంగ్రెస్ ఫైర్
హైదరాబాద్: రాజకీయ కక్ష సాధింపుతోనే అధికార తెరాస పార్టీ తమను సభ నుండి సస్పెండ్ చేసిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు స్థానంపై చర్చ జరిగితే ప్రభుత్వం ఇరకాటంలో పడటం ఖాయమన్నారు. అందుకే తమ పైన సస్పెన్స్ వేటు వేసిందన్నారు. పదిమంది టీడీపీ ఎమ్మెల్యేల పైన తెలంగాణ శాసన సభ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
సస్పెన్షన్కు గురైన అనంతరం ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నాలుగు గోడల మధ్య నుండి సస్పెండ్ అయినా ఈ విషయాలు విశాలమైన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. జాతీయ గీతం ఆలాపన సమయంలో తాము ఎప్పుడూ తప్పు చేయకున్నా నిరభ్యంతరంగా క్షమాపణ చెబుతున్నామని స్పష్టం చేసినా... సభలో జాతీయ గీతం విషయంలో చర్చ జరగడం శోచనీయమన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి స్పీకర్ అండ ఉందన్నారు. జాతీయగీతంపై టీడీపీకి గౌరవం ఉందన్నారు. జాతీయగీతం విషయంలో వందసార్లు క్షమాపణ చెప్పడానికైనా అభ్యంతరం లేదన్నారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. మాలలు, మహిళలు, మాదిగలకు కేబినెట్లో చోటు కల్పించాలని సభలో నిరసన తెలిపామని అందుకే తమను సస్పెండ్ చేశారన్నారు.

సభలో తమపై దాడి చేసినా చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. జాతీయ గీతాన్ని అవమానపర్చారన్న వంకతో మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. జాతీయగీతం ఆలపించే ముందు ప్రకటన రాలేదన్నారు. సభలో తమ ఎమ్మెల్యేల చొక్కాలు పట్టుకుని లాగారని ఆ దృశ్యాలు సీడీల్లో లేవన్నారు. జాతీయ గీతాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారన్నారు.
జాతీయ గీతం అంటే తనకు గౌరవం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు. తెలంగాణ శాసన సభలో సంపత్ కుమార్ మాట్లాడారు.
జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పారు. నియమాల ప్రకారం జాతీయ గీతం సమయంలో ప్రకటన చేయాలని, కానీ అలా చేయలేదన్నారు. రాజకీయ కక్షతో జాతీయ గీతం పేరిట వేధిస్తున్నారన్నారు. జాతీయ గీతాన్ని అవమానించడం సరికాదని బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సరికాదన్నారు.












Click it and Unblock the Notifications