రేవంత్ రెడ్డిపై మరో బండ: భూకబ్జా చేశాడని ఆరోపణ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మరో ఆరోపణ ఎదుర్కుంటున్నారు. తమ స్థలాన్ని కబ్జా చేశారని, ఆ స్థలంలోకి వెళ్తే గూండాలు, రౌడీలు బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లాకు చెందిన పేరి రెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. తమ స్థలాన్ని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.
శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను, తన సోదరి అరుణ, ఆమె భర్త గురవారెడ్డి కలిసి శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామం సర్వే నంబర్ 127లో 4850 గజాల స్థలాన్ని 11 మంది రైతుల నుంచి, రాజోలు కాన్స్టిటుయెన్సీ ఎస్సీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేశామని చెప్పారు. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశామన్నా రు.
అయితే, 2014లో ఫిబ్రవరిలో స్థలం వద్దకు వెళ్లి చూడగా కొందరు అక్కడ ఫెన్సింగ్తోపాటు సరిహద్దు రాళ్లు తొలగిస్తున్నారని, ఎందు కని నిలదీస్తే, తాము ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అనుచరులమని, ఆయన సూచనల మేరకే వాటిని తొలగిస్తున్నామని చెప్పారని పేరిరెడ్డి వెల్లడించారు.
ఆ స్థలం కోసం వస్తే చంపేస్తామని బెదిరించారని అన్నారు. ఈ విషయంపై పోలీసులకు, సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినా ఫలితం లభించలేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి సహా మరికొందరిపైన ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో న్యాయం కోసం తెలంగాణ హోం మంత్రిని కలుస్తామని చెప్పారు.
తమ ప్లాట్లపై కన్నువేసిన రేవంత్రెడ్డి అతని సోదరుడిని పురమాయించి, అతి తక్కువ ధరకే తనకు విక్రయించాల్సిందిగా బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి తన అనుచరులతో వచ్చి సుమారు రూ.10కోట్లకు పైగా విలువున్న ఈ భూములను తాము కొనుగోలు చేసిన ధరకు విక్రయించాలని, లేని పక్షంలో మీ అంతుచూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.