విద్యుత్ కోతలతో రైతులకు గుండెకోత; కేసీఆర్ వల్లే విద్యుత్ వ్యవస్థ నాశనం: రేవంత్ రెడ్డి
ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన కరెంటు కోతలు తెలంగాణ రాష్ట్రంలోనూ మొదలయ్యాయి. డిమాండ్ కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో త్రీఫేస్ విద్యుత్ సరఫరా వేళల్లో కోతలు విధిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సరిపడా కరెంటు నిల్వలు లేకపోవడం, విద్యుత్ కొనుగోలు సమస్య ఉండటంతో ముఖ్యంగా వ్యవసాయానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నట్లు, ఏ రోజుకారోజు విద్యుత్ కోతల వేళలు, కరెంటు ఉండే సమయాలను ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రైతాంగానికి కరెంట్ కోతలా : రేవంత్ రెడ్డి ప్రశ్న
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతులకు విద్యుత్ కోతలపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక మోడువారితే ఆ రైతన్నల మనోవేదన వర్ణనాతీతంగా ఉంటుందని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి ఏడు గంటల కరెంట్ అని వార్తా పత్రికలలో వచ్చిన కథనాలను పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రైతుల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థ నాశనం: రేవంత్ రెడ్డి
పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేసి పారేశాడు అంటూ కేసీఆర్ తీరును తప్పుబట్టారు. కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లు...విద్యుత్ వ్యవస్థలకు అప్పులు మిగిలాయని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందేనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

రైతులకు ఆందోళన అవసరం లేదన్న ట్రాన్స్ కో, జెన్ కో సి.ఎం.డి ప్రభాకర్ రావు
ఇదిలా ఉంటే రాష్ట్ర రైతాంగానికి శుక్రవారం నుంచి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యధావిధిగా ఉంటుందని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సి.ఎం.డి ప్రభాకర్ రావు వెల్లడించారు. విద్యుత్ కోతలు ఉంటాయని రాష్ట్ర రైతన్నలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతన్నలకు కావలసిన విద్యుత్తు నిరంతరాయంగా అందుతుందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో పవర్ కట్స్ కొనసాగుతున్నాయని, డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కరెంట్ కోతలు ఉండవని చెప్తున్నా, అనధికారికంగా కోత విధించే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఇక విద్యుత్ కోతల నేపథ్యంలో రైతన్నలు, ఎండాకాలం పంటల విషయంలో ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications