ప్రజలను దోచుకుంటున్నారు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ఫైర్, వరుస నిరసనలు
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచితే.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. పేదలకు సాయం అందించడం మాని ప్రభుత్వాలు జేబు దొంగల్లా మారాయని విమర్శించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఉచితాల పేరుతో కేసీఆర్ భారం మోపుతున్నారు: రేవంత్
విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.12 వేల కోట్లను రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం భారం మోపుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరల పెంపు సమన్వయంతోనే జరిగిందన్నారు. విద్యుత్ సంక్షోభం రావడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడం వల్లే... విద్యుత్ సంస్థలకు బకాయిలు ఏర్పడ్డాయి. కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దమనుషులు విద్యుత్ బిల్లు ఎగవేత వల్ల 6 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఒక చేత్తో ఉచితం ఇస్తున్నాం అంటూనే... మరో చేత్తో విద్యుత్ భారం మోపుతోందని కేసీఆర్ సర్కారుపై రేవంత్ విమర్శలు గుప్పించారు.
ఎన్నికలున్నాయనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు: రేవంత్
ఎన్నికలు ఉన్నప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు నాలుగున్నర నెలలు పెరగలేదన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు రాగానే మళ్లీ ధరలు పెరుగుతున్నాయన్నారు. ఎన్నికల కోసం మాత్రమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగకుండా ఐదు నెలలపాటు ఆపారని అన్నారు. బీజేపీ కోణంలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం అని విమర్శించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచాయని... మళ్లీ వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా కాంగ్రెస్ నిరసనలు: రేవంత్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు. మార్చి 31వ తేదీన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపుపై ఆందోళన చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా మహిళలందరూ పాల్గొనాలని కోరారు. అదే రోజు మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ ఏఈ, డీఈ ఆఫీస్ల ముందు నిరసన తెలుపుతామని చెప్పారు. ఏప్రిల్ 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు... కేసీఆర్, మోడీ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం ఉంటుందని రేవంత్ తెలిపారు. 5వ తేదీన కలెక్టర్ కార్యాలయల ముందు నిరసన, ముట్టడి... ఏప్రిల్ 7న విద్యుత్ సౌధ, పౌర సరఫరా ఆఫీస్ల ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు రేవంత్. కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.