ఎవరి మైండ్ బ్లాంక్ అవుతుందో రెండు నెలల్లో తేలుతుంది: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటర్ల మద్దతును చూరగొనటం కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఎన్నికలలో బి ఆర్ ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని మంత్రులు కేటీఆర్ ,హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు.
ప్రజలను మరోసారి మోసం చేయడానికి బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త అబద్దాల మూటని తెరపైకి తెస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాబోయే రెండు నెలల్లో ఎవరి మైండ్ బ్లాంక్ అవుతుందో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు గత ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోలే అమలు చెయ్యలేదన్నారు.

ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి, లక్ష రూపాయల పంట రుణమాఫీ, 3,106 రూపాయల నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల భర్తీ తదితర 2014, 2018 మేనిఫెస్టో హామీలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వారి కొత్త మేనిఫెస్టోను ఎవరు నమ్ముతారు అంటూ ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్, బిజెపి రెండు ఒకే పార్టీ లాంటివి అని ప్రజలకు అర్థమైందని పేర్కొన్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మైండ్ బ్లాంక్ అవడం ఖాయమన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం పైన కూడా టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కెసిఆర్ కు రేవంత్ రెడ్డి ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం గురించి ప్రశ్నించిన ఆయన, భోజన పథకంలో సమస్యలతో పాటు చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్న కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని లేఖలో డిమాండ్ చేశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజనం పథకం అభాసు పాలవుతుంటే.. ఇవేమీ పట్టనట్లుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి సీఎం కేసీఆర్ దిగజారారని రేవంత్ రెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications