దేశదిమ్మరి కేసీఆర్ కోసం విమానం; ఎవని పాలయ్యిందిరో తెలంగాణా: రేవంత్ రెడ్డి సెటైర్లు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని ఇప్పటికే తెలిసిందే. పార్టీ అధినేత కేసీఆర్ దేశ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టర్డ్ ఫ్లైట్ ను కొనుగోలు చేయనున్నారు. దీని కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కోసం పార్టీ సిద్ధమైందని సమాచారం. 12 సీట్లతో కూడిన ఈ విమానం కొనుగోలు కోసం దసరా పర్వదినాన పార్టీ ప్రకటన తరువాత ఆర్డర్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు గా తెలుస్తుంది.
సీఎం కేసీఆర్ దేశ పర్యటనల కోసం చార్టర్డ్ విమానం
తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ఆయన దేశ పర్యటన కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు విరాళాలు సేకరించి ఒక చార్టర్డ్ విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ కోసం కొనుగోలు చేసే విమానానికి విరాళాలు ఇచ్చిన నేతల్లో ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కాగా, ఒకరు నల్గొండ జిల్లాకు చెందిన నేత, ఇంకొకరు కరీంనగర్ జిల్లాకు చెందిన నేతగా చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో మరోవైపు జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు.

కేసీఆర్ కోసం విమానం ... వ్యంగ్యాస్త్రాలు సంధించిన రేవంత్ రెడ్డి
జాతీయ పార్టీ పెడుతున్న కేసీఆర్ సొంత విమానం ఉపయోగిస్తే ఇక సీఎం కేసీఆర్ సొంత విమానాన్ని కొనుగోలు చేస్తున్నారన్న వార్తలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. ముఖ్యంగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ విమానం కొనుగోలుపై సెటైర్లు వేశారు. దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడు అంటూ కెసిఆర్ ను టార్గెట్ చేశారు. అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏనాడు పరామర్శించిందీ లేదు. ఫామ్ హౌస్ దాటింది లేదు. కానీ ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నారట.. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అని రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా లో పేర్కొన్నారు.

దేశ దిమ్మరిలా తిరగటం కోసం విమానమా? రేవంత్ రెడ్డి సెటైర్లు
తన ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే ఆ అమరవీరుల కుటుంబాలను ఈరోజు వరకు కేసీఆర్ కలవలేదని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అప్పుల బాధతో రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొంతమంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నా రైతు కుటుంబాలను ఏనాడు కెసిఆర్ పరామర్శించి లేదని మండిపడ్డారు. ఎప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితమయ్యే కేసీఆర్, ఇప్పుడు కొత్తగా దేశదిమ్మరిలా తిరగడం కోసం జాతీయ రాజకీయాలంటూ విమానం కొంటున్నారని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications