అదే ఎత్తుగడతో కేసీఆర్కు ఝలక్: కోవా లక్ష్మికి రేవంత్ రెడ్డి షాక్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతికి, ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇది తెరాసలో కలకలం రేపుతోందట. పార్లమెంటరీ సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగారన్న ఫిర్యాదుతో ఢిల్లీలో 20 మంది ఏఏపీ ఎమ్మెల్యేలపై ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే.
వారిలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని రేవంత్ ఫిర్యాదులో కోరారు. ఇందుకు సంబంధించి తెరాస ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీలుగా సహాయమంత్రి హోదాలో కొనసాగిన ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటికీ లాభదాయక పదవుల్లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల వివరాలను రేవంత్ ఈసీకి పంపించారు.

అదే ఎత్తుగడతో రేవంత్ రెడ్డి
నియామకం మొదలు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను అన్నింటిని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏఏపీ ఎమ్మెల్యేల అనర్హత అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, అదే ఎత్తుగడతో రేవంత్ ఫిర్యాదు చేయడం ఇప్పుడు తెరాసలో కలకలం రేపుతోందని అంటున్నారు. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ సాగుతోంది.

కోవా లక్ష్మికి షాక్
ఢిల్లీ మాదిరి అనర్హత వేటు వేసే పరిస్థితి లేదని టీఆర్ఎస్ ధీమాతో ఉందట. అదే జరిగితే రేవంత్ న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ కేబినెట్లో మహిళలు లేరు. ఈసారి విస్తరణలో కోవా లక్ష్మికి దక్కవచ్చునని భావిస్తున్నారు. అయితే రేవంత్ నిర్ణయం ఆమెకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.

తలుపులు మూసుకుపోయే అవకాశం
అనారోగ్యం తదితర కారణాలతో ఇద్దరు ముగ్గురు మంత్రులను తప్పించి వారి స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో అనేక మంది ఎమ్మెల్యేల పేర్లు తెర పైకి వస్తున్నాయి. ఇందులో కోవా లక్ష్మీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గత నెలలో ఆదివాసీ-లంబాడాల వివాదం ముదిరిన తర్వాత ఆదివాసీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్టు లీకులు వచ్చాయి.

అలా ఆమె పదవి పోయింది
అయితే తాజాగా రేవంత్ ఫిర్యాదు చేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో కోవ లక్ష్మి కూడా ఉన్నారు. అదే జరిగితే ఆమెకు తలుపులు మూసుకుపోవచ్చునని అంటున్నారు. ఆసిఫాబాద్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన లక్ష్మి ఆ తర్వాత క్యాబినెట్ హోదాతో పార్లమెంటరీ సెక్రటరీగా నియామకమయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫిర్యాదుతో మిగతా అయిదుగురు ఎమ్మెల్యేలతో పాటు ఈమె పదవి కూడా పోయింది.

ఇప్పుడు పేరు పక్కన పెట్టేశారని
ఆ తర్వాత నుంచి ఆమె కేబినెట్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె ఆశలపై తాజాగా రేవంత్ ఫిర్యాదు నీళ్లు చల్లింది. ఒకవేళ కేసీఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపితే కోవ లక్ష్మి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదనే చర్చ సాగుతోందని అంటున్నారు. ఆమెను మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత అనర్హతకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారట. అయితే, కేసీఆర్ తీసుకోవాలని భావిస్తే అందుకు వెనక్కి తగ్గరని అంటున్నారు.












Click it and Unblock the Notifications