ఈటలతో భేటీ మీలా చీకట్లో కాదు!: కేటీఆర్, కేసీఆర్పై రేవంత్ తీవ్ర విమర్శలు, స్పెషల్ ఫ్లైట్ ఎవరిదంటూ.?
కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్తో భేటీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈటెల రాజేందర్, తాను కలిసిన మాట నిజమేనన్నారు రేవంత్. అయితే తాము చీకట్లో కలవలేదని వివరణ ఇచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ తరపున ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు.

ఈటలతో భేటీ బహిరంగ రహస్యమే.. మీలా చీకట్లో కాదంటూ రేవంత్ ఫైర్
ఈ సందర్బంగా టీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. గోల్కొండ రిసార్టులో తాను, ఈటల రాజేందర్ కలిశామని కేటీఆర్ అంటున్నారు.. అది బహిరంగ రహస్యమేనని అన్నారు. ఈటల రాజేందర్తో చీకటి ఒప్పందం కోసం కలవలేదన్నారు. వేం నరేందర్ రెడ్డి కుమారుడి లగ్న పత్రిక సందర్భంగా తామిద్దరం కలిశామన్నారు. కేసీఆర్ చేసే కుట్రలన్ీన ఈటల వివరించారని తెలిపారు. చీకట్లో కలిసే అలవాటు కేసీఆర్ కుటుంబానికే ఉందని రేవంత్ విమర్శించారు. ఈటల రాజేందర్ను బీజేపీలో చేర్చుకోవడానికి కిషన్ రెడ్డి వచ్చిన విమానం ఎవరిదో కేటీఆర్ చెప్పాలన్నారు. విమాన వివరాలు కేటీఆర్ చెప్తారా? లేక తనను బయటపెట్టమంటారో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు.

ఈటలతో పడటం లేదని హరీశ్ రావు చెప్పడం విడ్డూరం..
ఈ ఏడాది మే 7న వేంనరేందర్రెడ్డి కొడుకు లగ్నపత్రిక సందర్భంగా గోల్కొండ రిసార్టుకు పలు పార్టీలకు చెందిన నేతలు వచ్చారని.. ఆ సమయంలో బహిరంగంగానే ఈటెల, తాము కలిశామని రేవంత్ తెలిపారు. ఈటెల తనను కలిసిన సమయంలో కేసీఆర్ చేసిన లంగా పనులన్నీ చెప్పారని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ తోడుదొంగలేనని.. ఇద్దరూ కలిసి పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. 20 ఏళ్లు జోడు గుర్రాల తరహాలో ఈటల-హరీష్ రావు తిరిగారని, ఈటెల రాజేందర్ దేని కోసం కొట్లాడారో టీఆర్ఎస్ పార్టీ చెప్పాలన్నారు. ఈటెల అవినీతిపై విచారణ ఏమైందో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు, ఈటెలకు పడటం లేదని హరీష్ రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

రేవంత్తో భేటీపై ఈటల క్లారిటీ..
తెలంగాణ ప్రజలకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో హరీష్రావు చెప్పాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు చెల్లని రూపాయి అని రేవంత్ విమర్శించారు. తెలంగాణ కేబినెట్లో ఉన్న 18 మంది మంత్రుల్లో ఒక్కరైనా మాదిగ ఉన్నారా? అని ప్రశ్నించారు. మాదిగలు మంత్రులుగా పనికిరారా? అని రేవంత్ నిలదీశారు. మరోవైపు, రేవంత్ రెడ్డిని స్టార్ హోటల్లో కలిశానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ కూడా స్పందించారు. తాను రాజీనామా చేసిన తర్వాత అన్ని పార్టీల నేతల్ని కలిశానని.. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని కలిశానన్నారు ఈటల. రేవంత్ ను కలవడం చట్ట విరుద్దమైతేకాదు కదా? అని అన్నారు. ఎవరినైనా కలిస్తే.. పార్టీ మారుతున్నారని ప్రచారం చేయడం నీచమైన పని విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం కలిశామనడం కరెక్ట్ కాదన్నారు. అన్ని పార్టీల నాయకులు కలుసుకునే వాతావరణాన్ని కేసీఆర్ పొల్యూట్ చేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications