రేవంత్ రెడ్డి వర్సస్ కోమటిరెడ్డి - ఇద్దరి బలం తేలిపోయిందా..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సస్ కోమటిరెడ్డి. ఇద్దరిలో ఎవరి బలం ఎంత. మునుగోడు ఓట్ల లెక్కలు దీని పైన స్పష్టత ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించిన నాటి నుంచి కోమటిరెడ్డిని టీపీసీసీ చీఫ్ రేవంత్ టార్గెట్ చేసారు. రాజగోపాల్ రాజీనామా వెంటనే మునుగోడు కేంద్రంగా సభ ఏర్పాటు చేసి రాజగోపాల్ కు సవాల్ చేసారు. కాంగ్రెస్ అడ్డాగా ఉన్న మునుగోడులో సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవటం పార్టీకి.. వ్యక్తిగతంగా రేవంత్ కు సవాల్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో అటు టీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్ రాజగోపాల్ లక్ష్యంగా కాంట్రాక్టు కోసమే పార్టీ మారారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసారు.
కాంగ్రెస్ గెలవకపోయినా.. రాజగోపాల్ మాత్రం గెలవకూడదనేది రేవంత్ అండ్ కో లక్ష్యంగా కనిపించింది. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది. రాజగోపాల్ ఓడిపోయారు. అందుకు ప్రధానంగా కాంగ్రెస్ దక్కించుకున్న 23,905 ఓట్లు ప్రధాన కారణంగా విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ పూర్తిగా రాజగోపాల్ శక్తి సామర్ధ్యాలపైనే మునుగోడులో గెలుపు పైన ఆశలు పెట్టుకుంది. ఫలితాల్లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2018 ఎన్నికల్లో బీజేపీకి 12,725 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 97,239 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి 86,696 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు 23,905 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ దాదాపుగా 73 వేల ఓట్లను కోల్పోయింది. అవే ఓట్లను రాజగోపాల్ తన వైపు మళ్లించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది.
బీజేపీకి ఈ 73 వేల ఓట్లు పోలవ్వటంతో, ఇప్పుడు రాజగోపాల్ కు వచ్చిన ఓట్లు 86,696 గా ఉన్నాయి. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా జరిగింది. వామపక్షాల మద్దతు కోసం తొలుత రేవంత్ ప్రయత్నించారు. కానీ, సీఎం కేసీఆర్ హైజాక్ చేసారు. వామపక్ష పార్టీల మద్దతు కూడగట్టారు. వారి మద్దతు ఈ ఎన్నికల్లో ఎంత కీలకమైనదో, ఫలితాల తరువాత పార్టీలకు స్పష్టమైంది. దీని ద్వారా.. కాంగ్రెస్ ఓటర్లు పార్టీని కాదని, రాజగోపాల్ వైపు నిలిచారనే విశ్లేషణలు మొదలయ్యాయి. స్థానిక కాంగ్రెస్ ఎంపీ.. పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొనలేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే పీసీసీ చీఫ్ మారుస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ఆడియో వైరల్ అయింది.
రాజగోపాల్ ఓడటంతో పాటుగా అదే సమయంలో వెంకటరెడ్డికి ఈ ఫలితం పరోక్ష సమాధానంగా కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కు కంచు కోటగా ఉన్న మునుగోడులో ఇప్పుడు రాజగోపాల్ వైపు ఆ పార్టీ ఓట్ బ్యాంక్ మళ్లటం కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ ను ఓడించటం లో పరోక్షంగా కాంగ్రెస్ సక్సెస్ అయినా.. రాజగోపాల్ కు వచ్చిన ఓట్లు మాత్రం రేవంత్ అండ్ కో కు ఆందోళన కలిగించే అంశమే. ఫలితాల పైన స్పందించిన రేవంత్ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ కు లభించిన మద్దతు చూసిన తరువాత..తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ పైన చర్చ మొదలైంది.