రేపు ఢిల్లీకి రేవంత్, కాంగ్రెస్లోకి ముఖ్య నేతలు: కర్నాటక భవన్లో 30 గదులు బుకింగ్
టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి (రేపు) సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు.
హైదరాబాద్: టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి (రేపు) సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఎల్లుండి (మంగళవారం) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం ఆయనతో పాటు పలువురు నేతలు ఢిల్లీ బయలుదేరుతున్నారు.

కర్నాటక భవన్లో రేవంత్ పేరిట 30 గదులు
రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు, ఆయన అనుచరులు ఢిల్లీకి వెళ్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి పేరు మీద కర్నాటక భవన్లో 30 గదులను బుక్ చేశారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్య నేత హోటల్లో గదులను బుక్ చేశారని సమాచారం.

రేవంత్ రెడ్డితో పాటు వీరు కూడా
రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పదిమంది నియోజకవర్గ ఇంచార్జిలు, తెలుగు రైతు, మహిళా, ఐటీ విభాగాలతో పాటు పలు అనుబంధ సంఘాల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.

రేపు జలవిహార్లో ముఖ్య నేతలతో భేటీ
రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ముఖ్య అనుచరులతో జలవిహార్లో భేటీ కానున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటన చేసే అవకాశముంది. కాంగ్రెస్ నేత కుంతియా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయి, రేవంత్ చేరిక గురించి మాట్లాడనున్నారు. రేవంత్తో పాటు కీలక నేతలు కాంగ్రెస్లో చేరనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్లోకి మరిన్ని వలసలు, టీఆర్ఎస్ నుంచి కూడా
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచే కాకుండా టీఆర్ఎస్ నుంచి కూడా భారీగా వలసలు ఉంటాయన్నారు.

రైతులకు శాపంగా టీఆర్ఎస్ పాలన
టీఆర్ఎస్ పాలన రైతులకు శాపంలా మారిందని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ సర్కారు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల రైతులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఏకకాలంలో రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. తెరాస ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణాలను మాఫీ చేయటం వల్ల రైతులకు ఉపయోగం లేకుండా పోయిందన్నారు. బ్యాంకుల్లో వడ్డీలను ప్రభుత్వమే భరిస్తుందని శాసనసభలో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారన్నారు. గిట్టుబాటు ధర కోసం పోరాటం చేసిన రైతులను జైలులో పెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. వరికి రూ.2వేలు, పత్తికి రూ.5 వేలు మద్దతు ధర కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications