మద్దతిస్తాం: కేసీఆర్కు రేవంత్ లేఖ, టీడీపీలో టీఆర్ఎస్ నేతల చేరిక
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారనడానికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు.
హైదరాబాద్/ఖమ్మం: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారనడానికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు. రైతుల ఆవేదన కట్టలు తెంచుకోవడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలిచిన ఉచిత ఎరువులను ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే బడ్జెట్ కేటాయింపులు లేవని సాకులు చెప్పకుండా ఆదివారం జరిగే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సవరణలు ప్రతిపాదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తాము మద్దతు తెలిపుతామని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని 55 లక్షల రైతుల వివరాలు 10రోజుల్లోగా సేకరించాలని రేవంత్రెడ్డి కోరారు.
టీడీపీలో చేరిన టీఆర్ఎస్ నేతలు
రేవంత్ రెడ్డి సమక్షంలో దాదాపు 20 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పచ్చ కండువా కప్పుకున్నారు. వీరంతా పరిగికి చెందిన వారు. శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో తాండూరులో ప్రజాపోరు బహిరంగసభ జరిగింది. ఈ సభకు వెళుతున్న రేవంత్కు మన్నెగూడలో టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఆయన టీడీపీ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా పరిగికి చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ సర్కారు పూర్తిగా విఫలమైందని రేవంత్ ఈ సందర్భంగా విమర్శించారు. కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.