60 ఏళ్లలో కాంగ్రెస్ సీఎంలు చేయలేనిది.. కేసీఆర్ 9 ఏళ్లలోనే చేశారు: రేవంత్ రెడ్డి
నల్డొండ: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా నకిరేకల్లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడకుండా నల్గొండ కాంగ్రెస్ జిల్లాలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారని రేవంత్ అభినందించారు.
తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి వదులుకున్నారని రేవంత్ చెప్పారు. కొందరు కాంగ్రెస్ నుంచి గెలిచి దొరల గడీల వద్ద కాపలా కాస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దన్నారు రేవంత్. కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇసుక మీద ఎవరైనా పిల్లర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తారా? రూ. లక్షన్నర కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుంగుతుందా? అని ప్రశ్నించారు.

నల్గొండకు నీరు ఇచ్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నల్గొండకు నీరు ఇచ్చే 10 కిలోమీటర్ల టన్నెల్ పదేళ్లుగా ఎందుకు పూర్తి కాలేదని రేవంత్ ప్రశ్నించారు. తన ఫాంహౌస్ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకున్న కేసీఆర్.. నల్గొండకు నీరు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ నిలదీశారు. నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని.. నీళ్లేమో జగన్, నిధులు మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ తీసుకెళ్లారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నియామకాలు అనేవి కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయని విమర్శించారు. మనవడిని మంత్రిని చేసేందుకు కేసీఆర్ మూడోసారి అవ్వాలని అంటున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.
పేదోడికి ప్రగతిభవన్లోకి ప్రవేశం లేదు.. నాడు గద్దరన్నను కూడా లోపలి రానీకుండా ఎర్రటి ఎండలో బయట నిలబెట్టారని రేవంత్ ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు లోపల అతిథి మర్యాదలు.. మనం మాత్రం ఎండలో మగ్గిపోవాలా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ బక్కోడు కాదు.. లక్ష కోట్లు దిగమింగిన బకాసురుడు అని దుయ్యబట్టారు.
#TelanganaAssemblyElections2023#NAKREKAL: CONG CHIEF REVANTH REDDY's SHARPEST ATTACK AGAINST KCR FOR MAKING TELANGANA A DEBT (BORROWING) STATE.!
— Gururaj Anjan (@Anjan94150697) November 24, 2023
📌The combined 16 CMs of #AndhraPradesh have left us a debt of only 69,000 crores, but the Kalvakuntla family has put a burden of 6… pic.twitter.com/lGY7MLKNuT
60 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీఎంలు రూ.69 వేల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే.. కేసీఆర్ మాత్రం 9 ఏళ్లలోనే రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఎవడు దొంగ.. ఎవడు గజదొంగో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు రేవంత్. ఈసారి ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ జెండా ఎగరొద్దన్నారు.












Click it and Unblock the Notifications