శంషాబాద్లో రోడ్డు ప్రమాదం: కారు తప్పించబోయి లారీ బోల్తా, ఐదుగురు మృతి
హైదరాబాద్: నగర శివారు శంశాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఓ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముగ్గురు కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మరో 25 మంది గాయపడ్డారు. కూరగాయలు, ఇతర నిత్యావసరాలు కొనేందుకు సుల్తాన్పల్లి ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు శంషాబాద్ మార్కెట్కు లారీలో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తాపడటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో జేసీబీ సాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.
సహాయక చర్యలో పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. ప్రమాద ఘటనలో క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో కళాకుమార్ సునా(20), కృపా సనా(25), బుదన్(25), గోపాల్ దీప్(25), హస్తా యాదవ్(55) ఉన్నారు.
కాగా, ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 50 మంది కూలీలు ఉన్నారు. వీరందరు ఒడిశాలోని బలంగిర్ జిల్లా డాబుగా బ్లాక్ చికిలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.