సీఎం కాన్వాయ్పై పోచమ్మ గుడి నీడ, రోడ్డు విస్తరణ
హైదరాబాద్: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల సీఎంలకు వాస్తు సెంటిమెంట్లు బాగా పెరుగుతున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు వాస్తు మార్పుల కోసం ఇప్పటివరకు రూ. 170 కోట్లు ఖర్చుపెట్టారని మీడియాలో వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
ఐతే వాస్తు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఆకు ఎక్కువే చదివేశారు. ఇప్పటికే వాస్తు సంబంధిత వార్తలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న కేసీఆర్ కొత్తగా మరో వాస్తు పరమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం విన్నవారికి ఆశ్చర్యం కలగమానదు. తెలంగాణ సచివాలయంలో ఉండే సమత బ్లాక్కు వెళ్లడానికి వన్ వే మార్గం ఉంది. ఆ మార్గాన్ని రెండు మార్గాలుగా చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రోడ్డు విస్తరణ పనులకు రూ. 9.8 లక్షల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంత త్వరతిగతిన సీఎం కేసీఆర్ రోడ్డు విస్తరణ పనులకు అనుమతులు జారీ చేయడంపై మీడియా ఆరా తీసింది.
దీనికి కారణం ఏమిటంటే సీఎం కాన్వాయ్ ప్రయాణించే వాహనాలపై పక్కనే ఉన్న పోచమ్మ గుడి నీడ పడుతోందంట. గుడి నీడ పడటం మంచింది కాదని భావించిన కేసీఆర్... కాన్వాయ్ రాకపోకలు సాగించేందుకు వీలుగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాల్సిందిగా అధికారులకు సూచించారని సమాచారం.