ఈ ఓట్లు చెబుతున్న లెక్కలేంటి - టీఆర్ఎస్ అనుమానం నిజమైందా..!!
మునుగోడు ఉత్కంఠ పోరులో టీఆర్ఎస్ గెలిచింది. 10309 ఓట్ల తేడాతో కారు దూసుకెళ్లింది. కానీ, ఓట్ల లెక్కింపు వేళ అనేక కొత్త అంశాలు చర్చకు కారణమవుతున్నాయి. మునుగోడులో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. రాజగోపాల్ రెడ్డి బలమే పార్టీ బలంగా మారింది. కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు రాజగోపాల రెడ్డిని దెబ్బ తీసాయి. కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. టీఆర్ఎస్ - బీజేపీ - కాంగ్రెస్ తరువాత బీఎస్పీ నాలుగో స్థానంలో నిలిచింది. అన్ని శక్తులతో ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీఎస్పీ 4145 ఓట్లు సాధించింది.
ఆ పార్టీ అభ్యర్ధి అందోజు శంకరాచారి బరిలో నిలిచారు. ఇక, ఎన్నికల ముందు వివాదానికి కారణమైన చపాతీ మేకర్, రోడ్ రోలర్, చెప్పులు, డోలీ, కెమెరా, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులకు పోలైన ఓట్లు ఇప్పుడు మరోసారి ఆసక్తిగా కనిపిస్తోంది. మరమొని శ్రీశైలం యాదవ్ కు ఎన్నికల సంఘం చపాతి మేకర్ గుర్తు కేటాయించింది. శ్రీశైలం యాదవ్ కు 2407 ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత యుగ తులసి పార్టీ అభ్యర్థి శివ కుమార్ రోడ్డు రోలర్ గుర్తు పైన పోటీ చేసారు. ఆయనకు 1874 ఓట్లు వచ్చాయి. ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో నిలిచే కేఏ పాల్ మునుగోడులో 805 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ విశారదన్ మహారాజ్ బలపరిచిన ఇర్పుల గలయ్య(చెప్పుల జోడు)గుర్తుకు 2270 ఓట్లు వచ్చాయి.
ఓవరాల్గా ఈ మూడు గుర్తులకు కలిపి 6,551 ఓట్లు వచ్చాయి. ఈ గుర్తులు లేకపోయి ఉంటే తమ మెజార్టీ మరింత పెరిగేదని వాదిస్తోంది టీఆర్ఎస్. తమ గుర్తును పోలిన ఓట్లు లేకపోయి ఉంటే తమ అభ్యర్ధి మెజార్టీ మరింత పెరిగేదని టీఆర్ఎస్ నేతలు చెబుతన్నారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్ తమ విజయం ఆపటం బీజేపీ నేతలకు సాధ్యపడలేదని..కానీ, మెజార్టీ తగ్గించటంలో మాత్రం సక్సెస్ అయ్యారని అంగీకరించారు. ఎన్నికల ముందు స్వతంత్ర అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు విషయంలో పెద్ద వివాదమే చోటు చేసుకుంది. వీటి పైన టీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. తొలిగించాలని ఆదేశాలివ్వాలని కోరింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ, చివరకు ఈ గుర్తులు బ్యాలెట్ లో అలాగే ఉన్నాయి.
దాదాపు ఆరు వేలకు పైగా ఓట్లు ఈ గుర్తులకు పోలయ్యాయి. కానీ, ఈ వాదనతో బీజేపీ విభేదిస్తోంది. కానీ, మునుగోడులో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల పొత్తు కలిసి వచ్చింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలిసి వెళ్లి ఉంటే పోటీ మరింత ఉత్కంఠగా మారేది. ఈ విషయంలో కేసీఆర్ ముందస్తుగా చొరవ తీసుకొని వేసిన ఎత్తుగడ కలిసి వచ్చింది. ఇన్ని సమీకరణాల నడుమ టీఆర్ఎస్ గెలుపుతో..తెలంగాణలో భవిష్యత్ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.