రోడ్ రోలర్ ఎఫెక్ట్: మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు; సాయంత్రంలోగా కొత్త ఆర్వో నియామకం!!
మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతోంది. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తు మార్చడం పై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పై వేటు వేసింది.
మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి పై ఈసీ సీరియస్
ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా యుగ తులసి పార్టీకి సంబంధించి డ్రాలో వచ్చిన రోడ్డు రోలర్ గుర్తు ను తొలగించి బేబీ వాకర్ గుర్తు కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు రిటర్నింగ్ని అధికారి విషయంలో నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ తీసుకొని నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో, దేశవ్యాప్త ఆసక్తి నెలకొన్న క్రమంలో, ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న తప్పు జరగకుండా జాగ్రత్త తీసుకుంటుంది ఎన్నికల కమిషన్.
కొత్త రిటర్నింగ్ అధికారి కోసం ఎన్నికల కమిషన్ కు మూడు పేర్ల ప్రతిపాదన
చిన్న తప్పు జరిగినా సహించబోమని స్పష్టం చేయడంలో భాగంగా పార్టీ గుర్తును తనకు లేని అధికారాలతో మార్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మార్చాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త రిటర్నింగ్ అధికారి కోసం రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్ కు మూడు పేర్లతో ప్రతిపాదనలు పంపించారు. దీంతో సాయంత్రంలోగా ముగ్గురిలో ఒకరిని కొత్త రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది.
రోడ్ రోలర్ గుర్తు మార్పుతో రచ్చ.. రిటర్నింగ్ అధికారికి ఉద్వాసన
మునుగోడులో యుగతులసి పార్టీకి చెందిన అభ్యర్థి శివకుమార్ కు ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తును కేటాయించగా ఆ గుర్తును మార్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మళ్లీ బేబీ వాకర్ గుర్తును కేటాయించారు.దీంతో తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారని,ఆ తర్వాత బేబీ వాకర్ గుర్తుగా మార్చారని ఈనెల 17వ తేదీన యుగ తులసి పార్టీ అభ్యర్థి కే. శివ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రిటర్నింగ్ అధికారి వ్యవహారం పై సీరియస్ అయిన ఎన్నికల సంఘం మళ్లీ రోడ్ రోలర్ గుర్తును కేటాయించాలని సూచించింది. టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరును ఉందన్న ఆరోపణలు కూడా వెల్లువగా మారటంతో ఆయనను విధుల నుండి పక్కకు పెట్టింది. ప్రస్తుతమున్న రిటర్నింగ్ అధికారికి ఉద్వాసన పలికి, కొత్త వారికి అవకాశం కల్పించనుంది