వేముల రోహిత్ ఆత్మహత్య: కొత్త కోణం! స్మృతి, దత్తాత్రేయకు క్లీన్ చిట్
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఇష్యూలో కేంద్రమంత్రులు స్మృతి ఇరాని, బండారు దత్తాత్రేయలకు క్లీన్ చిట్ వచ్చిందని తెలుస్తోంది. రోహిత్ ఆత్మహత్య పైన హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఓ కమిషన్ వేసింది.
రోహిత్ వేముల అంశంలో దళిత అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. అయితే ఈ కారణంతో అతను ఆత్మహత్య చేసుకోలేదని కమిషన్ తేల్చిందని తెలుస్తోంది. జస్టిస్ రూపన్వాల్ కమిషన్ వేశారు. ఇది హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో స్మృతి ఇరానీకి, దత్తాత్రేయకు క్లీన్ చిట్ ఇచ్చారు.
అంతేకాదు, యూనివర్సిటీ అధికారులకు కూడా క్లిన్ చిట్ ఇచ్చింది. యూనివర్సిటీ రాజకీయ ఒత్తిడి లేకుండా సాగుతోందని పేర్కొన్నారు.
అలాగే, వేముల రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవని కూడా కమిషన్ పేర్కొంది. అతని తల్లి రాధిక మాల కమ్యూనిటికి చెందిన ఆధారాలు లేవని చెప్పిందని తెలుస్తోంది. వేముల రోహిత్ తల్లి రాధిక తనను పెంచిన తల్లిదండ్రుల గురించి తదితర వివరాలు చెప్పడం లేదని పేర్కొంది. ఆమె తన బయోలాజికల్ పేరెంట్స్ క్యాస్ట్ చెప్పి ఉంటుందన్నారు.
కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పలువురు రాజకీయ నాయకులు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చి ఆందోళనలకు మద్దతు పలికారు.
రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు వచ్చారు. వారంతా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను టార్గెట్ చేసారు. రోహిత్ వేముల వారి పేర్లు రాసి చనిపోయారని ఓ సూసైడ్ నోట్ ఉందని చెప్పి ఆ మంత్రులను టార్గెట్ చేశారు.
అయితే, వేముల రోహిత్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కమిషన్ పేర్కొందని తెలుస్తోంది. ఈ సందర్భంగా కమిషన్ పలు సూచనలు కూడా చేసింది. వేముల రోహిత్ ఆత్మహత్య పైన కేంద్రీయ విశ్వవిద్యాలయ వీసీని కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.