రోహిత్ ఇష్యూ: వీసీ అప్పారావు రాక, వీసీ ఛాంబర్, గెస్ట్హౌస్పై దాడి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మంగళవారం నాడు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పారావు రాకను వ్యతిరేకిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి.
రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో వీసీ అప్పారావు సుదీర్ఘ సెలవులపై వెళ్లారు. తాజాగా నేటి ఉదయం అప్పారావు తన సెలవు ముగించుకుని విశ్వవిద్యాలయానికి వచ్చారు.
ఇంచార్జీ వీసీగా ఉన్న పెరియాస్వామి నుంచి ఆయన బాధ్యతలను తీసుకోనున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు భగ్గుమన్నారు. వీసీగా అప్పారావును ఒప్పుకునేది లేదని ఆందోళనకు దిగారు. అంతటితో ఆగని విద్యార్థులు గెస్ట్ హౌస్ను ముట్టడించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఆ తర్వాత గెస్ట్ హౌస్పై దాడికి దిగిన విద్యార్థులు ఇంటిలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. వీసీ ఛాంబర్ను కూడా ధ్వంసం చేశారు. అప్పారావు జనవరి నెలలో చివరి వారంలో సెలవుల పైన వెళ్లారు. కాగా, భారీగా పోలీసులను మోహరించారు.
కాగా, అప్పారావు వీసీగా బాధ్యతలు చేపట్టే విషయమై మరో వాదన కూడా వినిపిస్తోంది. ఆయన ఈ రోజు బాధ్యతలు చేపట్టేందుకు రాలేదని, ఎప్పుడు బాధ్యతలు చేపట్టాలనే విషయమై చర్చించేందుకు వచ్చారని తెలుస్తోందని అంటున్నారు. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో కొందరితో అతను సమావేశమయ్యాడని, ప్రెస్ మీట్ కోసం కూడా ప్రయత్నించారని అంటున్నారు.
వర్సిటీ గెస్ట్ హౌస్లో అప్పారావు.. ఏబీవీపీకీ చెందిన కొందరు నేతలు, ఆరెస్సెస్కు చెందిన కొందరు నేతలు, ఆ భావజాలమున్న అధ్యాపకులతో భేటీ అయ్యారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించారు. దీనికి వీసీ బాధ్యత వహించాలన్నారు.