'చంద్రబాబు'తో కేసీఆర్ దెబ్బతీశారు, అంతా మీరే చేశారు: కేంద్ర నేతలపై బీజేపీ, జేపీ నడ్డా సీరియస్
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్కు ధీటైన నాయకుడు ఇక్కడి బీజేపీలో లేరని, ఓటమికి అందరిదీ బాధ్యత అని, కిందిస్థాయి నాయకుల నుంచి అందరూ విఫలమయ్యారని తెలంగాణ బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇక్కడి నేతలే కారణమని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత, పార్టీ ఇంచార్జ్ జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. వారిపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు కోర్ కమిటీ, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం జరిగింది. ఈ భేటీ వాడీవేడీగా జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓ ప్రయివేటు హోటల్లో సమావేశం జరిగింది. ఎన్నికల్లో ఓటమికి అందరూ బాధ్యత వహించాలని, ఎవరూ నిరాశ చెందకుండా వచ్చే లోకసభ ఎన్నికల్లో సత్తా చాటాలని నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సూచించారు.
ఏపీకి ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణకు లేదు
కేసీఆర్కు దీటైన నాయకుడు తెలంగాణ బీజేపీ శాఖలో లేరని, కింది స్థాయిలో నాయకులు విఫలమవడం కూడా పరాజయానికి కారణమైందని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. సీట్ల కేటాయింపులో ఆలస్యం జరిగిందని, అభ్యర్థులను ఏకపక్షంగా ఎంపిక చేసి తమకు అవకాశమివ్వలేదని పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ నాయకులకు అవకాశాలిస్తూ తెలంగాణ నుంచి కేంద్రంలో ఎవరికీ ప్రాతినిధ్యం లేకుండా చేశారని వాపోయారు. పైగా, ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేందుకే హడావుడి చేశారని, తీరా టికెట్లు ఇచ్చాక పట్టించుకోలేదని, ఎలా ముందుకు వెళ్లాలో చెప్పలేదని, జాతీయ పార్టీ నేతలు, కేంద్ర మంత్రుల పర్యటనల విషయంలోనూ సరైన సమాచారం లేదని, సమన్వయం లేదన్నారు. కొత్తవారికి రాష్ట్రాల బాధ్యతలు అప్పగించాలన్నారు.
మోడీ, కేంద్రమంత్రులు మెచ్చుకోవడం దెబ్బతీసింది
ప్రజలు ఈ ఎన్నికలను కేసీఆర్, చంద్రబాబు మధ్య జరిగిన పోరుగానే చూశారని, మరోవైపు తెలంగాణలో బీజేపీ తరపున ముఖ్య నాయకత్వం లేదని, ఏపీ నాయకులకు రాజ్యసభ, కేంద్ర మంత్రి పదవి, ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చారని, తెలంగాణలో దత్తాత్రేయను తొలగించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మరొకరికి స్థానం కల్పించలేదని, ఆయనను ఎందుకు తొలగించారో కూడా తెలియదని అభిప్రాయపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అన్న భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. ప్రధాని మోడీ పార్లమెంటులో కేసీఆర్ను పొగిడారని, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినపుడు కేసీఆర్ ప్రభుత్వ పథకాలను మెచ్చుకున్నారని, రెండు రోజుల క్రితం వచ్చిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారని, ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలిగించాయన్నారు.
రాష్ట్ర నేతలపై జేపీ నడ్డా సీరియస్
ఈ భేటీ సందర్భంగా జేపీ నడ్డా రాష్ట్ర ముఖ్య నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పదిమందికి పైగా కేంద్రమంత్రులు, నలుగురు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. సీట్లను పెంచుకోవడం పక్కన పెడితే కనీసం ఉన్న స్థానాలను కాపాడుకోలేకపోయారన్నారు. అసెంబ్లీ ఎన్నికల పరిస్థితే ఇలా ఉంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏమిటని కోర్ కమిటీ నేతలను ఆయన ప్రశ్నించారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని పార్లమెంటు ఎన్నికలకు వెళ్దామన్నారు. పార్టీ ఓటమికి సమష్టి బాధ్యత వహించాలని సర్ది చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టిన చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడమే కేసీఆర్కు కలిసొచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.
ఓట్ల గల్లంతుపై ఆగ్రహం
ఓట్ల గల్లంతు అంశంపై కూడాజేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు గల్లంతైనా పట్టించుకోకపోవడం పోలింగ్ బూత్ స్థాయిలో నాయకుల అసమర్థతేనని చెప్పారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల మాదిరిగా వనరులు అందించినా ఫలితాలు రాలేదని, ఓటమితో ఎవరూ నిరాశ చెందవద్దని, గెలుపోటములు సహజమేనని, రాష్ట్రంలో పార్టీకి అనుకూల వాతావరణం లేదని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు రాలేదన్నారు. కేంద్ర నాయకులపై రాష్ట్ర నాయకులు, రాష్ట్ర నాయకులపై జేపీ నడ్డీ నిప్పులు చెరిగారు.