పిడిగుద్దులు గుద్దారు: పబ్ సిబ్బందిపై రౌడీషీటర్ల దాడి, ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లోని కాక్టేల్ పబ్లో బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. రాత్రి సమయంలో పబ్ను తెరవారలంటూ పబ్ సిబ్బందిపై దాడి చేశారు. పబ్ సమయం ముగిసిందని అక్కడి సిబ్బంది నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు.
మద్యం మత్తులో పబ్ను తెరవాలంటూ మల్లేపల్లికి చెందిన రౌడీషీటర్ అనుచరులు పబ్లోని బౌన్సర్లపై దాడి చేశారు. బౌన్సర్లను చితకబాదడంతో పాటు అక్కడున్న వస్తువులను ధ్వంసం చేశారు. పబ్ తెరవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సిబ్బందిని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.
అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ తెరిచేందుకు అనుమతి లేదని చెబుతున్నా ఏమాత్రం వినిపించుకోని రౌడీషీటర్లు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. బౌన్సర్లపై పిడిగుద్దులు గుద్దారు. ఈ దాడిలో సుమారు ఐదుగురు బౌన్సర్లకు గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దాడికి పాల్పడిన రౌడీషీటర్లపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత బౌన్సర్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలిసింది. పబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.