నోట్ల రద్దు షాకింగ్: హైదరాబాద్లో ఎన్నారైలకు కొత్త కష్టాలు, 'చెన్నై'పై నిరసన
రద్దయిన నోట్లు మార్చుకునే వెసులుబాటు ఉన్న అయిదు కార్యాలయాల్లో హైదరాబాద్ లేదు. దీంతో ఇక్కడి వారికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.
హైదరాబాద్: నోట్ల రద్దు విషయమై సామాన్యులకు, ఎన్నారైలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీ లోపు నోట్లు మార్చుకోని వారు ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి, కారణం చూపించి మార్చి 31 లోగా మార్చుకోవచ్చునని తెలిపింది. ఎన్నారైలకు జూన్ 30వ తేదీ వరకు కేంద్రం అనుమతించింది.
అయితే, దానిని ఇప్పుడు అయిదు ఆర్బీఐ కేంద్రాలకే పరిమితం చేసి, అందరికీ షాకిచ్చారు. హైదరాబాదులో ఆర్బీఐ కార్యాలయం ఉంది. మార్చుకునే వెసులుబాటు ఉన్న అయిదు కార్యాలయాల్లో హైదరాబాద్ లేదు. దీంతో ఇక్కడి వారికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.
హ్యాక్ చేసినా తెల్సు, సెల్ఫోన్లో నేనే కీలకం: నోట్లరద్దుపై మళ్లీ బాబు ఆసక్తికరం
చాలామంది ఎన్నారైలు నోట్లు మార్చుకునేందుకు వచ్చారు. అలాగే, ఇంట్లో ఇంకా మిగిలి ఉన్న వారు కూడా వచ్చారు. హైదరాబాద్ ఆర్బీఐ కార్యాలయం వద్ద అనుమతి లేదని తెలిసి ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
హైదరాబాదులో అవకాశం లేదని, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కత, నాగపుర్ల్లోని ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవాలని హైదరాబాదులోని అధికారులు సూచిస్తున్నారు.
విదేశాల్లో ఉన్నవారితోపాటు, వివిధ రకాల కారణాలతో ఇంకా పాతనోట్లు మార్చుకోనివారి రాకతో హైదరాబాద్ ఆర్బీఐ కార్యాలయం రద్దీగా మారుతోంది. చేతిలో ఉన్న నాలుగైదు వేలు మార్చుకునేందుకు చెన్నై వెళ్లి రావాలంటే అంతకన్నా ఎక్కువగా ఖర్చవుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక నిరసన తెలిపారు.
ఉన్నత విద్య, ఉపాధి తదితర అవసరాల కోసం విదేశాలకు వెళ్లేవారు ఇండియన్ కరెన్సీని తీసుకెళ్లి అక్కడి విమానాశ్రయాల్లో ఆ దేశ కరెన్సీలోకి మార్చుకుంటారు. కేంద్రం రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేసిన వెంటనే ఖర్చుల కోసం తీసుకెళ్లిన నగదుకు విలువ లేకుండా పోయింది. అక్కడ తీసుకోవడం లేదు. విదేశాల్లోని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.