జగ్గారెడ్డి పై ముమ్మాటికి కక్ష్యసాధింపే..! రాజకీయంగా ఎదుర్కోలేకనే జిమ్మిక్కులంటున్న కాంగ్రెస్..
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పట్ల అదికార టీఆర్ఎస్ పార్టీ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోని బలమైన నాయకులను అదికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అదికార పార్టీ విధానాలను సమూలంగా ఎండగడుతూ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న కొంతమంది కాంగ్రెస్ నాయకుల పట్ల గులాబీ పార్టీ ఓ నజర్ వేసినట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎదుర్కోవడం అసంభవం అనుకున్న నాయకుల పట్ల గతంలో ఉన్న చిన్న చిన్న వివాదాలను బయటకు లాగి చట్టపరమైన చర్యలు తీసుకునేలా అదికార పార్టీ వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ నాయకలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పై పంతం..! అదికార పార్టీ చూస్తోంది అంతం..!!
రాజకీయంగా ఎదుర్కోవడం హుందాతనంగా ఉంటుంది తప్ప దొడ్డి దారిన కాంగ్రెస్ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించాలనుకోవడం దిగజారుడు రాజకీయమౌతుందని టీపిసిసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యప్తంగా బలంగా ఉన్న నాయకులను ఒక్కొక్కరిని విచారణ పేరుతో వేధించడం కూడా ఆయా నియోజక వర్గాల్లో ప్రజల ద్రుష్టి మళ్లించడమేనని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలుగా ఉన్న రేవంత్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల పైన కూడా అదికార పార్టీ గతంలో వివాదాలు స్రుష్టించింది. తాజాగా జగ్గారెడ్డి పై అక్రమ పాస్ పోర్ట్ కేసు బనాయించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. పోలీసులు న్యాయం,ధర్మం వైపు ఉండాలి గాని అదికార పార్టీకి అనుకూలంగా వ్యవహరింంచడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని వారంటున్నారు.
14 ఏళ్లనాటి కేసు..! ఇప్పుడెందుకు బయటపడిందంటోన్న కాంగ్రెస్..!!
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు రాజకీయ దుమారం రేపుతోంది. ఆయనపై కేసు నమోదు నిజమే అయినా, ఎప్పుడో 2004 కేసును తీసుకొచ్చి ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయన్ను అరెస్టు చేయటం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. అసలు ఇంత కాలం ఈ కేసులో పోలీసులు ఏమి చేశారన్నదే అసలు చర్చ. అసెంబ్లీ రద్దు అయి రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డిని అరెస్టు చేయటంతో ఆ పార్టీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. అందుకే అర్థరాత్రి అయినా సరే డీజీపీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది అక్రమ అరెస్టు అని ఆరోపించారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
బలమైన కాంగ్రెస్ నాయకులే టార్గెట్టా..? కేసులు నిలిచేనా..?
అదే సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి హరీష్ లపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనపై చేసిన ఆరోపణలు తప్పని, కేవలం రాజకీయ కక్ష్య తోనే తనను అరెస్టు చేశారని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ సభ సక్సెస్ తర్వాత తనను టార్గెట్ చేశారని అంటున్నారు జగ్గారెడ్డి. 2004లో జగ్గారెడ్డి బోగస్ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్పోర్టులు, వీసాలు సంపాదించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపించారు.ఈ అంశంలోనే నకిలీ పాస్ పోర్టులు స్రుష్టించి చట్టాలను ఉల్లంఘించాడని జగ్గారెడ్డి పై అభియోగాలు మోపుతున్నారు.
జగ్గారెడ్డి కేసులో రాజకీయ కోణం..! ఎదుర్కొంటాం అంటున్న కాంగ్రెస్ నేతలు..!!
సోమవారం రాత్రి పటాన్చెరు ప్రాంతంలో ఉన్న జగ్గారెడ్డిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మార్కెట్ పోలీసులకు అప్పజెప్పారు. మరో బృందం మెదక్ జిల్లాలో ఉన్న ఆయన అనుచరుడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించింది. వారు అక్రమ రవాణా చేసిన గుజరాతీయులు ఎవరనేది గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ గుజరాతీయులు అమెరికాలోనే ఉన్నట్లు అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఏ దళారుల ద్వారా జగ్గారెడ్డి ఈ అక్రమ రవాణాకు అంగీకరించారు.. ప్రతిఫలంగా ఆయనకు ఏం దక్కింది తదితర అంశాలను విచారిస్తున్నారు. జగ్గారెడ్డి అరెస్టును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఈ మొత్తం ఎపిసోడ్ పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంత్రుప్తిని వ్యక్తం చేస్తోంది.