తగ్గేదేలే.. సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ తీగల కృష్ణారెడ్డి; కబ్జాల ఆరోపణలతో మహేశ్వరంలో గులాబీల వర్గపోరు
రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అనేక జిల్లాలలో ఉన్న వర్గ పోరు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ నేతల మధ్య రచ్చ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే దాకా వెళ్లింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలు ప్రోత్సహిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ నేత తీగల కృష్ణా రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తే , మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయననెవరో మిస్ గైడ్ చేస్తున్నారంటూ, ఒకవేళ అలాంటి భూకబ్జాలు జరిగితే సీఎం కేసీఆర్ చూసుకుంటారు అంటూ స్పందించారు. ఇరువురు నేతల మధ్య బాహాటంగా జరుగుతున్న రగడ పార్టీలో చర్చకు కారణంగా మారింది.
సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలను ప్రిత్సహిస్తున్నారని తీగల సంచలన ఆరోపణలు
అసలేం జరిగిందంటే మీర్ పేట్ మంత్రాల చెరువును మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యా శాఖ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి మీర్ పేట్ ను నాశనం చేస్తున్నారంటూ టిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సబితా ఇంద్రారెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు . మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు.
చెరువులు, పాఠశాలల స్థలాలను కూడా వదలకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ మండిపడ్డారు. తమ పార్టీ నుండి సబితాఇంద్రారెడ్డి గెలవలేదని గుర్తుచేసిన ఆయన, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వైఖరిపై సీఎం కేసీఆర్ తో కూడా తాను చర్చిస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గాలికి వదిలేశారని తీగల కృష్ణా రెడ్డి మండిపడ్డారు.
భూకబ్జాలు చేస్తే సీఎం చర్యలు తీసుకుంటారు : సబితా ఇంద్రారెడ్డి స్పందన
ఇక తీగల కృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తీగల కృష్ణారెడ్డి ని ఎవరో మిస్ గైడ్ చేస్తున్నారంటూ సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. భూకబ్జాలు చేసే వారిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తీగల కృష్ణారెడ్డి చెప్పినట్టుగా భూకబ్జాలు చేసే ప్రభుత్వ పరీక్షిస్తూ కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అసలు తీగల కృష్ణారెడ్డి అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయనతో ఈ విషయంలో తప్పకుండా మాట్లాడుతాను అంటూ సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ నేతల ఆధిపత్యపోరు
2018 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కెసిఆర్ ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక అప్పటి నుండి తీగల కృష్ణారెడ్డి పార్టీపై, సబితా ఇంద్రారెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఇరువురు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి? .. జోరుగా పార్టీలో చర్చ
ఈ క్రమంలోనే తీగల కృష్ణారెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహార శైలితో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తీగల కృష్ణారెడ్డి పార్టీ మారేందుకు రెడీ అయినట్లుగా సమాచారం. త్వరలో తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సబితా ఇంద్రా రెడ్డికి షాక్ ఇస్తూ పలువురు కార్పొరేటర్లు, బడంగ్ పేట మేయర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు తీగల కూడా జంప్ అయితే టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టే!!