సాగర్ ఎన్నిక భావోద్వేగంతో కూడుకున్నది.!టీఆర్ఎస్ జబ్బలు చరుచుకోవడం విచిత్రమన్న రాములమ్మ.!
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆరెస్ అభ్యర్థి గెలుపుపై ఆ పార్టీ జబ్బలు చరుచుకోవడం విచిత్రంగా ఉందని బీజేపి నాయకురాలు విజయశాంతి అన్నారు. నియోజకవర్గంలోని లక్షా 89 వేల పైచిలుకు ఓటర్లలో దాదాపు లక్షమంది టీఆరెస్ని వద్దనుకున్నారన్న విషయం రుజువైందని విష్లేశించారు. అదీగాక ఈ గెలుపు కోసం ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఓటర్లను ఒత్తిడికి గురి చేసిన సంగతి సాగర్ ప్రజలందరికి తెలుసని స్పష్టం చేసారు.
మరోవైపు కాంగ్రెస్ నుంచి అత్యంత సీనియర్ నేత, నియోజకవర్గానికి ఎంతో చేశారంటూ జానారెడ్డి కేంద్రంగా బలమైన ప్రచారం జరిగినా ఆయన ఓటమి పాలు కావటం గమనిస్తే తెలంగాణ ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ని వద్దనుకున్నట్టు తేటతెల్లం అయ్యిందని తెలిపారు. బీజేపీ ఓటమి విషయానికి వస్తే, సాగర్ ఉపఎన్నిక అత్యంత ప్రత్యేక పరిస్థితులలో జరగడమే కాక, సానుభూతి పవనాలు కూడా ప్రభావితం చేశాయన్న విషయాన్ని మర్చిపోకూడదని విజయశాంతి తెలిపారు. ఈ మధ్యనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను, అంతకుముందు జరిగిన దుబ్బాక ఎన్నికలోను బీజేపీ సాధించిన విజయం రాబోయే శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి ప్రత్యామ్నాయం కమల దళమేనన్న సంకేతాలు వెలువడ్డాయని తెలిపారు విజయశాంతి.
ఇక నేడు వెల్లడైన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే, అస్సాంలో బీజేపీకి మరోసారి ప్రజామోదం లభిస్తే, పుదుచ్చేరిలో తొలిసారి అధికార పగ్గాలు ఎన్డీయేకే దక్కాయని తెలిపారు. ఇక తమిళనాడులో డీఎంకేకి క్లీన్ స్వీప్ అన్న అంచనాలను బీజేపీ-ఏడీఎంకే కూటమి గట్టిగా నిలువరించింది. బెంగాల్లో 3 స్థానాల నుంచి దాదాపు 80 సీట్ల స్థాయికి బీజేపి ఎగబాకిందని విజయశాంతి గుర్తు చేసారు.