ప్రముఖ అనువాదకుడు రంగనాథ రామచంద్రరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం...
ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. రామచంద్రరావు తెలుగు అనువాదం 'ఓం ణమో' పుస్తకానికి ఈ అవార్డు వరించింది. ఈ నవలను కన్నడంలో శాంతినాథ దేసాయి రాశారు. కథకుడిగా,అనువాదకుడిగా సాహితీ రంగంలో రామచంద్రరావు విశేష కృషి చేస్తున్నారు.
రామచంద్రరావు పూర్వీకులది మైసూరు సమీపంలోని చామరాజనగర్.అయితే చాలా ఏళ్ల క్రితమే వారి కుటుంబం కర్నూలు వచ్చి స్థిరపడింది. తల్లిదండ్రుల నుంచి కన్నడ,కర్నూలులో పుట్టి పెరగడం వల్ల తెలుగు భాషలు వచ్చాయి. కన్నడ నుంచి అత్యుత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందజేసేందుకు ఆయన అనువాద రచనను ఎంచుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఒకరకంగా తన అనువాదాలతో తెలుగు, కన్నడ సాహితీ రంగాలకు ఆయనొక వారధిగా ఉన్నారు.
దాదాపు 350 పైచిలుకు కథలను రామచంద్రరావు తెలుగు సహా వివిధ భాషల్లోకి అనువదించారు.ఇందులో 200కి పైగా కన్నడ కథలు ఉన్నాయి.మిగిలినవాటిల్లో హిందీ,ఇంగ్లీషు కథలు ఉన్నాయి.కన్నడ నుంచి తెలుగుకు అనువదించిన కథల్లో 'రాళ్లు కరిగే వేళ', 'తిరుగుబాటు', 'ఓం నమో', 'పూర్ణచంద్ర తేజస్వి జీవితమూ సాహిత్యమూ', 'అంతఃపురం', 'అవధేశ్వరి','ప్రసిద్ధ సమకాలీన కన్నడ కథలు', 'నలుపు, తెలుపు కొన్ని రంగులు' 'మూగడి బాధ','మా అమ్మంటే నాకిష్టం' తదితర కథలు ఉన్నాయి.