సమత హత్య కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ, నిందితులకు ఉరే సరి అంటోన్న బాధితులు
సమతపై లైంగికదాడి చేసి, హతమార్చిన నిందితులపై ఫాస్ట్ర్ట్రాక్ కోర్టు గురువారం తీర్పు వెలువడించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. హత్యకేసులో వాదనలు జనవరి 20వ తేదీన పూర్తి కాగా.. 27వ తేదీన తీర్పును మేజిస్ట్రేట్ వెలువడించాల్సి ఉంది. కానీ న్యాయమూర్తి అనారోగ్య కారణంతో గురువారానికి వాయిదాపడింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని సమత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..
కుమ్రంభీం జిల్లాకు చెందిన సమత నవంబర్ 24వ తేదీన కనిపించకుండా పోయారు. బెలూన్లను విక్రయించుకొని జీవించే ఆమె.. ఎప్పటిలాగే నవంబర్ 24వ తేదీన కూడా వెళ్లారు. తిరిగివస్తోండగా ఎల్లపటార్ గ్రామ శివారులో షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుం అనే కీచకులు వెంట పడ్డారు. సమత ఒక్కరే ఉండటంతో ఆమెను అడ్డుకొని.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహికంగా లైంగికదాడి చేశారు. తర్వాత గొంతుకోసి హతమార్చారు. ఆ రోజు సాయంత్రం అవుతోన్న సమత ఇంటికి రాకపోవడంతో భర్త గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

20 రోజుల్లో చార్జిషీట్..
నవంబర్ 25వ తేదీన సమత మృతదేహం లభించింది. శరీరంపై గాయాలు కూడా కనిపించాయి. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నవంబర్ 27వ తేదీన షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుం ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు తీవ్రత దృష్ట్యా డిసెంబర్ 11వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్ 14వ తేదీన పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేవలం 20 రోజుల్లోనే చార్జీషీట్ ఫైల్ చేశారు.

25 మంది సాక్ష్యం
డిసెంబర్ 23వ తేదీ నుంచి సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించారు. 44 మంది సాక్షులు అని పోలీసులు చెప్పినా.. 25 మంది మాత్రమే కోర్టులో సాక్ష్యం చెప్పారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు ఫాస్ట్ట్రాక్ కోర్టుకు సమర్పించారు. నిందితుల తరఫున వాదించేందుకు లాయర్లు ముందుకురాకపోవడంతో న్యాయస్థానమే రహీం అనే అడ్వకేట్ను కేటాయించింది. రెండురోజుల సమయం ఇవ్వగా ఆయన వాదనలు వినిపించారు. జనవరి 20వ తేదీన సమత కేసులో వాదనలు ముగిశాయి. ఈ నెల 27వ తేదీన తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. మేజిస్ట్రేట్ అనారోగ్యం వల్ల గురువారానికి వాయిదాపడింది.

ఉరే సరి
సమత కేసు నిందితులు షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుంను ఉరితీయలని రాం నాయక్ తండా, గోసంపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్లో నేరం చేసేందుకు భయపడాలని చెప్పారు. దిశ హత్య కేసు నిందితుల మాదిరిగా ఎన్కౌంటర్ చేయాల్సింది కానీ.. వీలైనంత త్వరగా ఉరితీయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications