ఇరికించారని సండ్ర ఆరోపణ: ఐదు రోజుల కస్టడీ కోరిన ఎసిబి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తనను ఇరికించారని, దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మంగళవారం ఉదయం ఎసిబి కోర్టుకు తరలించిన సందర్భంగా ఆయన ఈ మాటలన్నారు. కాగా, సండ్రను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఎసిబి కోర్టును కోరింది.
ఓటుకు నోటు కేసులోనిందితుడైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యను తెలంగాణ ఎసిబి అధికారులు మంగళవారం ఉదయం కోర్టుకు తరలించారు. అంతుకు ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఎసిబి కార్యాలయానికి తీసుకుని వచ్చి అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. కేసు విచారణ నిమిత్తం ఎమ్మెల్యేను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును ఏసీబీ కోరనుంది. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా ఏసీబీ నిన్న సండ్రను తమ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

నోటుకు ఓటు కేసులో అరెస్టయినవారి సంఖ్య సండ్ర అరెస్టుతో నాలుగుకు చేరుకుంది. కేసులో మూడో నిందితుడు మత్తయ్యను ఇంకా అరెస్టు చేయాల్సింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జిమ్మీ విచారణకు హాజరు కాలేదు.
సండ్ర వెంకట వీరయ్యను సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్యాప్తు అధికారి మల్లారెడ్డి ఆధ్వర్యంలో విచారించారు. ఎసిబి అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనకు తెలియదంటూ సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సెబాస్టియన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాడు కాబట్టి ఆయనతో మాత్రమే తాను మాట్లాడినట్లు సండ్ర చెప్పారని అంటున్నారు.












Click it and Unblock the Notifications