రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అంతా మర్చిపోయా, ఇక ఐక్య పోరాటమే: జగ్గారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని బుధవారం సాయంత్రం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ సందేశం విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని తెలిపారు.
కలిసికట్టుగా పోరు కొనసాగిస్తాం: జగ్గారెడ్డి
నా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలవాలని అనుకున్నాను. అది ఈరోజు కుదిరింది. రాజకీయాల కంటే ముందు మా పిల్లల చదువుల గురించి అడిగారని జగ్గారెడ్డి తెలిపారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలతో రాజకీయం చేస్తున్నాయి. టీఆరెస్ పార్టీతో పాటు మొత్తం ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలసికట్టుగా పనిచేసి, ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తాం అని జగ్గారెడ్డి చెప్పారు.
రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత అన్ని మర్చిపోయా: జగ్గారెడ్డి
రాహుల్ తో మాట్లాడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న విబేధాలన్నీ మర్చిపోయా. అప్పుడు చెప్పిన విషయాలేవీ గుర్తులేవు. మొన్నటి సమావేశంలో ఇచ్చిన సందేశం మేరకు కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళతాం. మనం, మన కుటుంబం అంటే.. ప్రజలు, దేశం అన్నట్టుగా మేమంతా కలసికట్టుగా పనిచేస్తాం. బహిరంగ విమర్శలు ఇకపై ఉండవు. మీరు కూడా చూడరు. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవు. కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్లతో కూడా పార్టీ అంశాల గురించి చర్చించా అని జగ్గారెడ్డి తెలిపారు.
తెలంగాణలో ఇక కాంగ్రెస్ నేతల ఐక్య పోరాటం
కాగా, ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని పార్టీ అధిష్టానం స్పస్టం చేసింది.
బేధాభిప్రాయాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం అంతా కలిసి పనిచేయాలని సూచించింది. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డికి మధ్య విబేధాల నేపథ్యంలో ఆయన తాజాగా రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ నేతలంతా ఐక్య పోరాటాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కూడా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.