దటీజ్ మోడీ! భేష్: మన్మోహన్ మాజీ అడ్వైజర్ సంజయ్ బారు, పీవీ పైన..
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పైన.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పని చేసిన ప్రముఖ పాత్రికేయులు సంజయ్ బారు ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ అనతికాలంలోనే అంతర్జాతీయ నేతగా ఎదిగారని, ఆయన రాజనీతిజ్ఞుడన్నారు.
బలమైన ప్రధాని, ముఖ్యమంత్రులు మంచి పరిణామం అని చెప్పారు. మన్మోహన్ సింగ్ను కాంగ్రెస్ పార్టీయే బలహీనపర్చిందన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు దక్కాల్సిన గౌరవం, పేరు రాలేదన్నారు. ప్రధాని మోడీ ఒత్తిడికి లొంగకుండా అమెరికాతో సంబంధాలను గాడిలో పెట్టారన్నారు.
ఆఫ్రికా దేశాల మనసు మళ్లీ గెలుచుకున్నారని, పాకిస్తాన్తో సత్సంబంధాలకు బాగానే కృషి చేస్తున్నారని, ఆయన లాహోర్ పర్యటన విజయవంతమైనందునే పఠాన్కోట్ ఘటన చోటు చేసుకుందన్నారు. మొత్తం మీద విదేశాంగ నీతిలో మోడీ ప్రయత్నాలు బాగున్నాయన్నారు.
అయితే, దేశ ప్రజల్ని ఒప్పించటమంటే విదేశాంగనీతిలో నెగ్గినంత సులభం కాదన్నారు. అలాగని అది అసాధ్యం కూడా కాదన్నారు. ఆదివారం హైదరాబాద్ సాహితీ వేడుక ముగింపు ఉత్సవాల్లో ‘భారత ప్రధానమంత్రులు' అనే అంశంపై నిర్వహించిన చర్చలో సంజయ్ బారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనదేశంలో బలమైన ప్రధాని, బలమైన ముఖ్యమంత్రులున్న తరాన్ని ఇప్పుడే తొలిసారిగా చూస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే. రాష్ట్రాల అవసరాలు, ముఖ్యమంత్రుల సమర్థత ప్రధానికి తెలుసు కాబట్టి తదనుగుణంగా ఆయన చర్యలు ఉంటాయని భావించారు.
మరోవైపు గతంలో ఆధిక్యం లేకుండా సంకీర్ణ ప్రభుత్వాలను నడిపినవారే బాగా రాణించారని, 400 పైచిలుకు సీట్లు గెల్చుకున్న రాజీవ్ గాంధీ విఫలంకాగా, మైనార్టీ సర్కారును నడిపిన పీవీ నరసింహారావు అద్భుతాలు సృష్టించారన్నారు. కానీ, పీవీకి రావల్సినంత పేరు దక్కలేదన్నారు.
నెహ్రూ, పీవీ నరసింహారావులు క్లిష్టమమైన పరిస్థితుల్లో పదవిని చేపట్టారని, నెహ్రూ ఏ దేశం ఎదుర్కోని సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తే, పీవీ ప్రధాని పదవి చేపట్టే నాటికి భారత్ అన్నిరకాలుగా దయనీయ స్థితిలో ఉందన్నారు. అలాంటి స్థితి నుంచి అందరి దృష్టిని ఆకర్షించే స్థితికి పీవీ తీసుకొచ్చారన్నారు.
ప్రస్తుతం మోడీ గద్దెనెక్కే సమయానికి కూడా భారత్ పరిస్థితి ఏమీ బాగోలేదని, మరి ఆయన ఎలాంటి వారసత్వాన్ని మిగులుస్తారో చూడాలన్నారు. ఇప్పటికైతే ప్రధాని మోడీ బాగా పని చేస్తున్నారన్నారు.
ప్రత్యామ్నాయ సమర్థ అధికారాన్ని చూపించాలన్న ఉద్దేశంతో వాజ్పేయి తొలిసారి ప్రధానిగా రాణించేందుకు ఆరెస్సెస్ సహకరించినట్లే, సంకీర్ణాలకు తాము సానుకూలమే అని నిరూపించేందుకు 2004లో మన్మోహన్కు ప్రధానిగా కాంగ్రెస్ పూర్తి మద్దతిచ్చిందన్నారు.
నిజానికి మన్మోహన్ కారణంగానే కాంగ్రెస్ 2009లో విజయం సాధించిందని, అయినా, కాంగ్రెస్ అప్పటినుంచి మన్మోహన్ను బలహీన పరచటం మొదలెట్టిందన్నారు. 2012 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ఉంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేసి, మన్మోహన్ను రాష్ట్రపతి చేయాలనుకున్నారని, రాహుల్ అప్పుడే కాదు.. ఇప్పటికీ ఓట్లు రాబట్టలేకపోతున్నారన్నారు. కుంభకోణాల సంక్షోభాన్ని కాంగ్రెస్ సరిగ్గా పరిష్కరించలేదన్నారు.