గ్రేటర్ ఎన్నిక: ఏపీలో టిడిపి 'సంక్రాంతి' ప్రచారం, జగన్ ఔట్... ఆ సెటిలర్స్ టిఆర్ఎస్కేనా?
అమరావతి/హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరంలో పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. హైదరాబాదులో అంతటా తెరాస ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసుకొని విపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు ఆరోపించాయి.
నగరంలో ఎక్కడ చూసినా తెరాస హోర్డింగులు కనిపిస్తున్నాయి. విపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదనే వాదనలు ఉన్నాయి. అయితే, తెలుగుదేశం పార్టీకి మాత్రం ప్రచారం చేసుకునేందుకు సంక్రాంతి పండుగ ద్వారా కొంతలో కొత్త అవకాశం వచ్చిందని అంటున్నారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాదులో నివసిస్తున్న సీమాంధ్రులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తమ సొంతూళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీలోని తమతమ ఇళ్లకు వస్తున్న సీమాంధ్రుల వద్ద ఏపీ టిడిపి ప్రచారం చేసుకునే అవకాశం వచ్చింది.

హైదరాబాదులో సీమాంధ్రుల హక్కులు రక్షించాలంటే ఫిబ్రవరి 2వ తేదీన జరిగే గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి - బిజెపిలకు ఓటు వేయాలని సంక్రాంతి పండుగకు ఏపీ తరలి వచ్చిన హైదరాబాద్లోని సీమాంధ్రులకు విజ్ఞప్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాదులో ఉంటున్న ఏపీలోని సీమాంధ్రుల ఇళ్లకు టిడిపి నేతలు వెళ్లి టిడిపికి ఓటేయాలని చెబుతున్నారని తెలుస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల నుంచి కూడా హైదరాబాదులో ఉంటున్నారు.
కేవలం గుంటూరు జిల్లా నుంచే దాదాపు 40వేల మంది సీమాంధ్రులు హైదరాబాదులో ఉంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సీమాంధ్రులకు టిడిపినే రక్షణగా ఉంటుందని వారు చెబుతున్నారని తెలుస్తోంది.
కాగా, తెలుగుదేశం పార్టీకి మరో భయం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపిని బద్ధ శత్రువుగా భావించే లేదా, వైసిపిని అభిమానించే వారు అధికార తెరాస పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications