జాబ్ వదిలేసి వరంగల్ రావడమే సారిక చేసిన తప్పా?
హైదరాబాద్: మామ రాజయ్య మాట విని తిరిగి వరంగల్కు అనిల్ కుమార్తో సంసారం చేయడానికి రావడమే సారిక చేసిన పెద్ద తప్పా అనే సంశయం కలుగుతోంది. జరిగిన విషాద ఘటన చూసిన తర్వాత రెండోసారి ఆమె వరంగల్కు రాకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటూ బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే మాట వినిపిస్తోంది.
తనకు భర్త వేధింపులు ఎక్కువకావడంతో సారిక 2014లో బేగంపేటలోని మహిళా పోలీస్స్టేషన్లో అత్త, మామ, భర్త, వివాహేతర సంబంధం నెరుపుతున్న సనాపై పోలీసులకు సారిక ఫిర్యాదు చేసింది. వీరిపై 498/ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది. అయితే, విచారణ తర్వాత ఎస్.రాజయ్యకు సంబంధం లేదని ఆయన పేరు తొలగించారు.
Photos: రాజయ్య కోడలు మృతి
అప్పుడు ఎంపీగా ఉన్న రాజయ్య కోడలుకు సర్దిచెప్పి రాజీ కుదిర్చి హన్మకొండలోని ఇంటికి వచ్చారు. కొద్దిరోజుల పాటు వీరి సంసారం బాగానే ఉంది. ఈ సమయంలోనే సారిక గర్భం దాల్చి కవల పిల్లలు శ్రీయోన్ - అయోన్లకు జన్మనిచ్చింది. తాను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత రాజయ్య తన తనయుడు అనిల్ కుమార్ను తన వారసునిగా క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్న క్రమంలోనే భర్త అనిల్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకుని సారిక పలుమార్లు భర్తను హెచ్చరించింది. అయితే ఫలితం దక్కలేదు.

వరంగల్ వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య మళ్లీ కలహాలు చెలరేగాయి. దీంతో సారిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెద్దలు నచ్చజెప్పడంతో ఉద్యోగం మానేసి, ఇంటిపట్టునే ఉంటూ వచ్చింది. వరంగల్ రెవెన్యూ కాలనీలోని ఇంటిని కొడుకు, కోడలుకు వదిలేసి రాజయ్య దంపతులు వేరేచోట ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా సారిక, అనిల్ వేర్వేరు గదుల్లో నివసించేవారు.
దీనికితోడు తనను వివాహం చేసుకోవాలంటూ సనా ఒత్తిడి తేవడంతో అనిల్ మరింత ఒత్తిడికి గురయ్యాడు. ఈ ఒత్తిడితో భార్య సారికతో గొడవపడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కడంతో రాజయ్య సెంటిమెంట్గా భావించే సారిక ఉంటున్న ఇంటికిమారాడు. బుధవారం రెండోసారి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగానే తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరగడం విషాదాన్ని నింపింది.
సారిక స్వస్థలం. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం. తల్లిదండ్రులు వంగల లలిత, శ్రీనివాసాచారి. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. శ్రీనివాసాచారి పంచాయతీరాజ్శాఖలో పనిచేసి పదవీ విరమణపొందారు. పెద్ద కుమార్తె పేరు అర్చన. ఎంకాం పట్టభద్రురాలు. మూడో కూతురు దీపిక డిగ్రీ పూర్తిచేశారు. రెండో కూతురైన సారిక కామారెడ్డిలో ఇంటర్మీడియట్ వరకు చదివింది.

ఆ తర్వాత కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్లోని ఇంజినీరింగ్ కాలేజీలో 2002లో బీటెక్లో చేరింది. అప్పుడే కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన సిరిసిల్ల రాజయ్య కొడుకు అనిల్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లాస్మెంట్స్ కావడంతో ఈ పరిచయం ప్రేమగా మారింది. అనిల్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందగా, సారిక బీసీ వర్గానికి చెందిన యువతి. ఇద్దరి కులాలు వేరుకావడంతో ఈ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న భయంతో 2006లో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. తర్వాత యాదగిరిగుట్టలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది.
అనిల్, సారిక ఇంజినీరింగ్ పూర్తిచేశాక లండన్కు వెళ్లారు. తర్వాత బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం పెట్టారు. ఈ సమయంలో అంటే 2007లో వీరికి అభినవ్(7) పుట్టాడు. తర్వాత హన్మకొండకు మకాం మార్చారు. ఇక్కడకు వచ్చాకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. దీంతో సారిక కొడుకుతో హైదరాబాద్కు వెళ్లి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా జీవించసాగింది.
ఆసమయంలో అనిల్ పార్టీలో పని చేసే మైనార్టీ వర్గానికి చెందిన సన అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన సారిక భర్తను పలుమార్లు మందలించింది. అయినా, అతను వినిపించుకోలేదు. ఇంతలో 2009 జరిగిన ఎన్నికల్లో మామ సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాతనే సారిక వరంగల్కు తన మకాం మార్చింది. పెద్దల సూచన మేరకు ఉద్యోగం కూడా వదిలేసింది. దాంతో ఆమెకు జీవనోఫాధి కూడా లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications