సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లల్లో వాటికి ఎండ్ కార్డ్: ఐఐటీ- హెచ్ మాస్టర్ ప్లాన్
సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలల్లో ప్రయాణికుల రద్దీని క్రమబద్దీకరించడానికి, ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారాన్ని గుర్తించడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక అడుగు వేసింది. ఈ రెండు ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం, వాహనాల రద్దీని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంది. దీనికోసం ఐఐటీ- హైదరాబాద్తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమగ్ర ట్రాఫిక్ ప్రణాళికల రూపకల్పనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ చేపడుతున్న ఈ సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. సికింద్రాబాద్- లింగంపల్లి స్టేషన్ల పరిధిలో ప్రయాణికుల రాకపోకలు సులభంగా, సురక్షితీంగా ఉండేలా వెళ్లేలా ఐఐటీ- హెచ్ ప్రణాళికలు రూపొందిస్తుంది. స్టేషన్ లోపల ప్లాట్ ఫామ్స్ పై గానీ, ఆవరణలో వాహనాల పార్కింగ్, ఎంట్రీ/ఎగ్జిట్, పాదచారుల కదలికలు, ఒకేసారి ఎంతమంది రాకపోకలు సాగించవచ్చు.. అనే అంశాలపై అధ్యయనం చేస్తారు.

ప్రయాణికుల కోసం మల్టీమోడల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని రావడం, స్టేషన్ పరిధిలోని రద్దీ పాయింట్లను గుర్తించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక రోజులో ఎన్ని వ్యక్తిగత వాహనాలు స్టేషన్లకు వస్తాయనేది ఐఐటీ టీమ్ ఆరా తీస్తుంది. క్యాబ్లు, ఆటోల కోసం ప్రత్యేకంగా పికప్, డ్రాప్ పాయింట్ల ఏర్పాటు వంటి ప్రయాణికుల సదుపాయాల మార్పులను ఈ నివేదిక ఆధారంగా చేపట్టనున్నారు అధికారులు.
స్టేషన్ పరిసరాల్లోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనాల నియంత్రణ, వాటిని క్రమబద్ధీకరించడం, సిగ్నలింగ్ వ్యవస్థల మెరుగుదల వంటి పనులకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. స్టేషన్ల పరిసరాల్లోని ట్రాఫిక్ అవరోధాలకు ఖచ్చితమైన పరిష్కారాలను ప్రతిపాదించేందుకు ఐఐటీ హైదరాబాద్ బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది. దీనికోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల సహాయంతో సర్వేలు చేపట్టనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత సీసీటీవీ విశ్లేషణ సహాయంతో ప్రయాణికుల రద్దీ సమయాల్లో వాహనాల కదలికలను నిరంతరం పరిశీలిస్తుంది. భవిష్యత్ ట్రాఫిక్ సవాళ్లను పరీక్షించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ సిమ్యులేషన్ కూడా సహాయపడనుంది.
ఈ అధ్యయనం విషయంలో సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కమర్షియల్, ఇంజినీరింగ్, ఆపరేటింగ్ విభాగాలు, ఆర్పీఎఫ్ సిబ్బంది.. ఐఐటీ హైదరాబాద్ టీమ్ కు సహకరిస్తాయి. ప్రస్తుతం సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో పురోగతిలో ఉన్న పునర్నిర్మాణ పనుల్లో ఈ అధ్యయనం అత్యంత కీలకంగా మారనుంది. ఐఐటీ సిఫార్సుల ఆధారంగా భవిష్యత్తులో సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ల నిర్వహణపై సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.













Click it and Unblock the Notifications