సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు- రూట్ ఇదే: తేదీలు, హాల్ట్ స్టేషన్లు..!!
Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లనూ పొడిగిస్తూ వస్తోన్నారు.

- తాజాగా సికింద్రాబాద్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీపావళి పండగ తర్వాత తిరుగుముఖం పట్టనున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
- ఈ నెల 28, నవంబర్ 2 తేదీల్లో అంటే మంగళ, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07081 ప్రత్యేక రైలు రెండో రోజు అర్ధరాత్రి 12 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ కు చేరుకుంటుంది.
- ఈ నెల 30, నవంబర్ 4 తేదీల్లో అంటే గురు, మంగళవారాల్లో తెల్లవారు జామున 6:20 నిమిషాలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బయలుదేరే నంబర్ 07082 ప్రత్యేక రైలు రెండో రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
- మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ, బస్మత్, హింగోళి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలాపతి, భోపాల్, బీణా, ఝాన్సీ, గ్వాలియర్, ధౌల్ పూర్, ఆగ్రా కంటోన్మెంట్, మథుర మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.












Click it and Unblock the Notifications