సమ్మర్లో బెస్ట్ ఆప్షన్- చర్లపల్లి నుంచి ఉత్తరాఖండ్కు స్పెషల్ రైళ్లు
Special Trains: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ, ఖాజీపేట్ నుంచి దాదార్ వెళ్లే వేసవి ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించారు. దీనితో పాటు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్కు కొత్తగా సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టారు. ఈ నెల 14వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం-తిరుపతి మధ్య కొత్తగా సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రతీ సోమవారం సాయంత్రం 5:40 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07122 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
తాజాగా చర్లపల్లి- డెహ్రాడున్, కాచిగూడ- బిలాస్పూర్ మధ్య సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి తెల్లవారు జామున 5 గంటలకు బయలుదేరే నంబర్ 07077 ఎక్స్ప్రెస్.. మరుసటి రోజు సాయంత్రం 7:20 నిమిషాలకు డెహ్రాడున్కు చేరుకుంటుంది.
ఈ నెల 24వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు డెహ్రాడూన్ నుంచి బయలుదేరే నంబర్ 07078 ఎక్స్ప్రెస్.. మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఖాజీపేట్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, రాణీ కమలాపతి, బీణా, ఝాన్సీ, ఆగ్రా కంటోన్మెంట్, మధుర, హజ్రత్ నిజాముద్దీన్, మీరట్, రూర్కీ, హరిద్వార్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
మే 12 నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రతి సోమవారం ఉదయం 10:05 నిమిషాలకు బిలాస్పూర్ నుంచి బయలుదేరే నంబర్ 08263 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. మే 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు ప్రతి మంగళవారం కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 08264 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 9:35 నిమిషాలకు బిలాస్పూర్కు చేరుకుంటుంది.
భాటాపారా, రాయ్పూర్, దుర్గ్, రాజ్నంద్గావ్, డోంగర్గఢ్, గోండియా, వాడ్సా, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, ఖాజీపేట్, చర్లపల్లి, మల్కాజ్గిరి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications