అగ్నిప్రమాద ఘటన: పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి; సమగ్ర విచారణకు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ డిమాండ్!!
సికింద్రాబాద్ బోయ గూడాలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 11 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. బోయ గూడాలోని ప్లాస్టిక్ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో బీహార్ కు చెందిన 11 మంది వలస కూలీలు మృతి చెందిన ఘటన పై ఇప్పటికే సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బోయ గూడా లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు .అగ్ని ప్రమాద ఘటనలో మృతిచెందిన వలస కూలీల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో 11 మంది వలస కార్మికులు సజీవదహనం కావడం బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారి మృతి తీవ్రంగా కలచి వేసిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు మృతి చెందడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Recommended Video


అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలి: రేవంత్ రెడ్డి
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ బోయ గూడా అగ్ని ప్రమాద ఘటనపై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనుమతుల నుంచి సేఫ్టీ చర్యల దాకా.. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: బండి సంజయ్
బోయిగూడ అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవదహనం కావడం కలచివేసిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. పొట్టకూటి కోసం బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బండి సంజయ్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అనుమతుల నుంచి సేఫ్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం ఇలాంటి ఘోర ప్రమాద ఘటనలకు కారణమని బండి సంజయ్ పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.












Click it and Unblock the Notifications