తెలంగాణ కాంగ్రెస్లోకి బిగ్ షాట్స్..
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్పై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
అదే సమయంలో కాంగ్రెస్ జూలు విదిలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో చేరికలకూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

తాజాగా కాంగ్రెస్ కండువాను కప్పుకోవడానికి మరికొందరు నాయకులు క్యూలో ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్కు కొండంత బలాన్ని ఇచ్చింది. అధికార బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీల్లో ఇమడలేకపోతున్న సీనియర్లు- ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూపులు సారిస్తోన్నారు.
బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కొందరు నాయకులు పార్టీ ఫిరాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి.. బీజేపీకి గుడ్బై చెప్పడానికి సిద్ధపడినట్లు సమాచారం.
వారిద్దరూ కూడా కాంగ్రెస్ వైపు చూపులు సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏనుగు రవీందర్రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో భేటీ అయినట్లు వార్తలొచ్చాయి. ఇక యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. అవి ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం.. కాంగ్రెస్ కండువాను కప్పుకోవడం లాంఛనప్రాయమే.
ఏనుగు రవీందర్రెడ్డి రెండేళ్ల కిందటే బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆయనకు ఎల్లారెడ్డి టికెట్పై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. దీనితో పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ వెంట అనేక పార్టీ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు ఏనుగు రవీందర్ రెడ్డి.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో సైతం ఆయన ఈటల వెంటే ఉన్నారు. ఈటలకు ఎన్నికల కమిటీ అధ్యక్షుడి చేసిన అనంతరం నెలకొన్న సందడిలో ఎక్కడా రవీందర్రెడ్డి కనిపించలేదు. ఈటలకు పదవి ఇవ్వకముందే రవీందర్రెడ్డి.. రేవంత్రెడ్డితో భేటీ అయ్యారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కాంగ్రెస్లో కూడా ఏనుగు రవీందర్ రెడ్డికి.. ఎల్లారెడ్డి టికెట్పై స్పష్టత ఇవ్వలేదని, బాన్సువాడ టికెట్ పరిశీలిస్తామని రేవంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా కిషన్రెడ్డి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ కావడం, ఆయనతో యెన్నంకు బంధుత్వం ఉండటం, మహబూబ్నగర్ కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి లేకపోవడం తనకు కలిసి వస్తాయనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.జూపల్లితోపాటే తాను కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్న విషయాన్ని ఇప్పటికే సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి మరో ముఖ్య నాయకుడు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధపడుతున్నారనే ప్రచారం ఉంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారాయన. బీజేపీలో బండి నాయకత్వంలో పనిచేసిన వివేక్కు, కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ నాయకత్వంలో పార్టీలో కొనసాగడం ఇష్టం లేదని అంటోన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇప్పటికే వివేక్ రేవంత్రెడ్డితోనూ, అధిష్టానం పెద్దలతోనూ చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్, దినపత్రికకు అధినేతగా ఉండటం వల్ల వివేక్.. చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక మీడియా హౌస్ మద్దతు కూడా ఉంటుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ముందు ఆయన ఒకట్రెండు డిమాండ్లు ఉంచారని, అభ్యర్థనను ఎక్కువ కాలం నాన్చితే, బీఆర్ఎస్లోకి వెళ్లాలనే ఆలోచనలో కూడా ఉన్నవివేక్ ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications