కేసీఆర్ సోకులు!: తెరాస-బిజెపి మధ్య వాగ్యుద్ధం, ఫిరాయింపుల కోసమూనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17వ పైన పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా పార్టీల మధ్య విమోచన, విలీన, విద్రోహ దిన వాదనలు రాజుకుంటున్నాయి. తాజాగా, శనివారం వరంగల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరగడంతో తెరాస నేతలు స్పందిస్తున్నారు. బిజెపి-టిడిపి మధ్య ఇటీవల ప్రెండ్ షిప్ కుదురుకుంటున్నట్లుగా కనిపించింది. కానీ విమోచన అంశంపై దుమ్మెత్తిపోసుకున్నాయి.
కర్ణాటక, మహారాష్ట్రల్లోని అప్పటి నిజాం పాలిత ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేస్తుంటే విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించడం కేసీఆర్కు అవమానంగా తోస్తుందా అని అమిత్ షా వరంగల్ సభలో నిలదీశారు. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నారో అందరికీ తెలిసిందేనన్నారు.
ఆయన వేలాది బలిదానాలు చేసిన అమరుల త్యాగాలకు, రజాకార్ల దాష్టీకానికి ఒకేరోజు బైరాన్పల్లిలో బలిదానం చేసిన వందమందికి భయపడడం లేదన్నారు. ఒక్క ఒవైసీకి మాత్రం భయపడుతున్నారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అధికారంలో ఉన్నవారంతా మజ్లిస్కు భయపడుతున్నారనీ, భాజపా ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు.
అమిత్ షాకు తెరాస నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తెరాస ఎంపీ పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. అందుకే విమోచన దినం అంటోందన్నారు. తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయన్నారు. నిధుల విషయంలోను పల్లా రాజేశ్వర రెడ్డి మండిపడ్డారు. నిధుల విషయంలో అమిత్ షా అబద్దాలు చెబుతున్నారన్నారు.
ఎంపీ కవిత మాట్లాడుతూ.. తమకు లాభం చేకూరుతుందనుకున్నప్పుడల్లా బీజేపీ మతతత్వ అంశాలను తెరపైకి తీసుకు వస్తుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలోను తాము విలీన దినమే జరిపామన్నారు. గోవా దేశంలో కలిసినప్పుడు విమోచన దినమని కేంద్రం పేర్కొందని, కానీ 1948లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగింది పోలిస్ చర్యగానే పేర్కొన్నారన్నారు. తెలంగాణ విమోచనమని ఎప్పుడూ అనలేదన్నారు.
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులతో పాటు అందరూ విమోచన దినోత్సవం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖలు రాయాలని సూచించారు. వచ్చే ఏడాదైనా కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా ఉండాలన్నారు.
ఇదిలా ఉండగా, నిధుల విషయంలోను అమిత్ షా.. కేసీఆర్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. సొమ్ము కేంద్రానిది అయితే సోకు కేసీఆర్ది అని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం సుమారు రూ.90 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తోందన్నారు. హైదరాబాద్- బెంగళూరు ఎక్స్ప్రెస్వే, హైదరాబాద్- విజయవాడ నాలుగు వరుసల రహదారి, హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి, గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయాల వంటి అనేక పథకాల పేరున ఈ సహకారం అందజేశామన్నారు.
మోడీ ప్రభుత్వం 15 రోజులకో సంక్షేమ పథకాన్ని తెస్తోందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద రూ.790 కోట్లు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోలేదన్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు.
సంక్షేమ పథకాలకు తిలోదకాలిచ్చారన్నారు. అనైతికంగా ఇతర పార్టీల నేతలను తెరాసలో చేర్చుకుంటున్నారని. టిడిపి, వైసిపి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఇలాగే చేర్చుకున్నారన్నారు. ఢిల్లీ నిధులు ఫిరాయింపుల కోసం వాడుతున్నారని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, విపక్షాలు సైతం ఈ విషయంలో ఆయన్ని ఎత్తిచూపలేదన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కంపెనీకి స్వస్తి చెప్పి బీజేపీకి అవకాశమివ్వాలన్నారు. దీంతో, నిధులపై అమిత్ షా అబద్దాలాడుతున్నారని తెరాస ధ్వజమెత్తుతోంది.