సెప్టెంబర్17 రాజకీయం; కేంద్రం వర్సెస్ రాష్ట్రం; పోటాపోటీ వేడుకలపై ఎవరి వ్యూహం వారిదే!!
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్17 అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణంగా మారింది. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన రోజును జాతీయ సమైక్యత దినోత్సవంగా గుర్తించి, 74 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సంస్థానం ఇదే రోజు రాచరిక పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలన చేపట్టిందని సమైక్యత దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇక ఇదే సమయంలో నిజాం రాజుల పాలన నుంచి విముక్తి పొంది, తెలంగాణ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పొందిందని నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తోంది.
హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణా విమోచనా దినోత్సవ వేడుకలు..హాజరైన అమిత్ షా
ఈరోజు భాగ్యనగర కేంద్రంగా తెలంగాణలోని అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని అధికార బీజేపీ రెండూ తమదైన శైలిలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో కేంద్ర ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ జెండాను ఆవిష్కరించిన అమిత్ షా అమరవీరుల స్థూపం వద్ద, అలాగే వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఇక పెరేడ్ గ్రౌండ్ లో అమిత్ షా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర పారా మిలటరీ బలగాలు పరేడ్ నిర్వహించాయి. అమిత్ షా కేంద్ర బలగాల గౌరవవందనం స్వీకరించి వేడుకలలో పాల్గొంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలకు సీఎం కేసీఆర్
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అట్టహాసంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.
సెప్టెంబర్ 17పై ఎవరి వ్యూహం వారిదే
హైదరాబాదులోనే అటు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు తెలంగాణ ప్రజానీకం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా వేడుకలు నిర్వహించడం పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 17 ఎవరి వ్యూహం వారిదే అన్న చర్చ జరుగుతుంది. కేసీఆర్ తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదు కాబట్టి తాము నిర్వహిస్తున్నామని చెప్పే ప్రయత్నం కేంద్రం చేస్తే, కేంద్రానికి చెక్ పెట్టేలా కేసీఆర్ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రతివ్యూహం రచించారు.
సెప్టెంబర్ 17 ను తమకు అనుకూలంగా మార్చుకునే యత్నంలో కేంద్రం, రాష్ట్రం
ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈరోజు కెసిఆర్ కేంద్రాన్ని ఏవిధంగా టార్గెట్ చేయబోతున్నారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు వచ్చిన అమిత్ షా సీఎం కేసీఆర్ ను ఏ విధంగా ఇరకాటంలో పెట్టబోతున్నారు అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏదిఏమైనా సెప్టెంబర్ 17ను అటు టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు బిజెపి ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.