కోవిడ్ డెత్ ఆడిట్ ఏర్పాటు చేయండి.! హైకోర్టు లో దాసోజు శ్రావణ్ పిల్.!
హైదరాబాద్ : కరోనాతో తెలంగాణలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారని, దాదాపు 1లక్షా 20వేల మంది చనిపోయారని అంచనా ఉండగా కేవలం 3912 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని, సుప్రీం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కరోనా బాదిత కుటుంబాలకు 50వేల రూపాయిలు సాయం ప్రకటించిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ స్పష్టం చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు కారణంగా 1లక్షా 20వేల బాదితులు వుంటే కేవలం 3912 మందికి మాత్రమే సాయం అందే పరిస్థితి వుందని, మిగతా వారందరికీ ఎవరు న్యాయం చేస్తారని శ్రవణ్ ప్రశ్నించారు. కోవిడ్ ఆర్ధిక సాయంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో బాదిత కుటుంబాలకు న్యాయం జరగాలని శ్రావణ్ డిమాండ్ చేసారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల వాస్తవ సంఖ్య బయటకు రావాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకి పోకుండా కోవిడ్ డెత్ ఆడిట్ నిర్వహించి వాస్తవ మరణాలని వెల్లడించినప్పుడే బాదితులందరీకి న్యాయం జరుగుతుందని డా. దాసోజు శ్రావణ్ సూచించారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలపై ప్రభుత్వం డెత్ ఆడిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్ హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యని తక్కువగా చేసి చూపిన టీఆర్ఎస్ ప్రభుత్వం బాదిత కుటుంబాలకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం కోవిడ్ మరణాల సంఖ్యని దాచి పెట్టిందని, కరోనా మరణాలపై దుర్మార్గంగా వ్యవహరించిందని డా. దాసోజు శ్రావణ్ మండిపడ్డారు.