తీవ్ర సంక్షోభంలో తెలంగాణా.. బాంబు పేల్చిన కేటీఆర్!!
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని ధ్వజమెత్తారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని టార్గెట్ చేశారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు కేటీఆర్ .
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా.. మీ ప్రజాపాలన
పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని అసహనం వ్యక్తంచేశారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా.. మీ ప్రజాపాలన అంటే.. అని నిలదీశారు.

ఆ నిధులు ఏమయ్యాయి?
నాడు.. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్ గా రూ.275 కోట్లు విడుదల చేశామని పేర్కొన్న కేటీఆర్ ..నేడు.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్ లపై నిర్బంధాలు.. అక్రమ అరెస్టులు సాగుతున్నాయని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారు..? చెప్పాలని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారు.. చెప్పాలని నిలదీశారు.
జీహెచ్ఎంసీకి అరాకొరా నిధులు
12,769పంచాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ.4305కోట్లని అంచనా. వాటి పరిస్థితి ఏంటి చెప్పాలన్నారు. దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యం అని ప్రశ్నించిన కేటీఆర్ గ్రేటర్ తోపాటు.. రాష్ట్రంలోని 12కార్పొరేషన్లు, 129మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఉందన్నారు.రాష్ట్ర బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో.. మహానగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
సీఎం పర్యవేక్షిస్తున్న శాఖకే నిధుల కొరత.. వాటి సంగతేంటి రేవంత్
కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో.. పల్లె ప్రగతికి పాతరేసి.. పట్టణ ప్రగతిని అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా ? సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖకే ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే.. ఇక ఇతర శాఖల దుస్థితి ఏమిటి ? చెప్పాలని సూటిప్రశ్న వేశారు. ఆగష్టు 15లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా.. అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి..
— KTR (@KTRBRS) August 14, 2024
ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది..
అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో… pic.twitter.com/Yk6qlkejWT
ఈ సంక్షోభం మీ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం
బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం మీ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం అని కేటీఆర్ స్పష్టం చేశారు. మీ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోకండి అంటూ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications