వివిధ రాష్ట్రాల యువతులతో ‘ఆన్లైన్’ సెక్స్ రాకెట్: నిర్వాహకురాలి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మహిళలను బలవంతంగా వ్యభిచారం ఊబిలోకి దింపుతున్న ముఠాను కొండాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు వ్యభిచార ముఠాలను అరెస్ట్ చేసినప్పటికీ.. నగరంలో ఏదో ఒక మూల ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు.. తాజా కొండాపూర్లో కొనసాగుతున్న వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. మహిళా నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) గత కొంత కాలంగా కొండాపూర్ సమీపంలోని శ్రీరాంనగర్లో ఓ ఫ్లాట్ని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. సాయిప్రతాప్ అపార్ట్మెంట్లో కొనసాగుతున్న వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మహిళ ఇంటర్నెట్ను ఉపయోగించుకుని వివిధ రాష్ట్రాల నుండి అందమైన అమ్మాయిలను తీసుకునివచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తోందని వారు పోలీసులకు చెప్పారు. రోజూ ఆ ప్రాంతానికి కొత్తకొత్త వాళ్లు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో అందర్నీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 11 సెల్ఫోన్లు, రూ. 6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.