జగిత్యాల జిల్లాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై అత్యాచారం .. కేసు నమోదు
బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, కామాంధులకు ఉరి శిక్ష వేసినా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మనుషుల్లో రోజురోజుకీ పెరుగుతున్న పశు ప్రవృత్తికి తాజాగా జరుగుతున్న ఘటనలే ఒక ఉదాహరణ . పోక్సో చట్టాల్లో సవరణలు చేసినా , చిన్నారులపై లైంగిక దాడులు చేస్తే ఉరి శిక్ష వేసేలా చట్టాలు మార్చినా సరే అన్నెం పున్నెం ఎరుగని పసికందులను కామాంధులు చిదిమేస్తున్న సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా జగిత్యాల జిల్లాలో ఎనిమిదేళ్ళ చిన్నారి అందమైన బాల్యాన్ని చిదిమేశాడు ఓ కామాంధుడు. స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో మామ వరసయ్యే ఒక సఫాయి పని చేసే వ్యక్తి బాలికను తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు . మేడిపల్లి మండలం పసునూరు గ్రామంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారుల్లో 8 ఏళ్ల ఒక చిన్నారిని గంగా రెడ్డి అనే సఫాయి తీసుకెళ్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో అత్యాచారం చేశాడు. ఇక అక్కడ నుండి ఇంటికి వెళ్ళిన ఆ చిన్నారి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన గంగారెడ్డి మామ వరుస అవుతారు. ఇక బాలిక చెప్పిన విషయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు గంగారెడ్డిని అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం చిన్నారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇక ఈ అఘాయిత్యానికి పాల్పడిన గంగారెడ్డికి కఠిన శిక్షలు పడేలా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు బాలిక తరపు బంధువులు . ఎన్ని చట్టాలు ఉన్నా మగవారి దృష్టిలో మార్పు రానంత కాలం ఇలాంటి ఘటనలు మన సమాజాన్ని బాధిస్తూనే ఉంటాయి.