సమంతకే చీర కట్టుకోవడం తెలుసా: మరోసారి విరుచుకుపడ్డ షబ్బీర్
తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటి సమంతను నియమించడంపై షబ్బీర్ అలీ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ స్త్రీలకు చీర కట్టడం రాదా అని అడిగారు.
హైదరాబాద్: సినీ నటుడు నాగార్జునకు కాబోయే కోడలైన సినీ నటి సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై కాంగ్రెసు నేత షబ్బీర్ అలీ మరోసారి విరుచుకుపడ్డారు. "చీర కట్టుకోవడం తెలంగాణ మహిళలకు రాదా?నాగార్జునకు కాబోయే కోడలు సమంతకే తెలుసా?ఆమె తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడరా?" అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
దానిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై, ఆయన కుమారుడైన మంత్రి కెటి రామారావుపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. "ఇవి తండ్రీ కొడుకుల తమాషాలు కావా ?" అని ఆయన కెసిఆర్, కెటిఆర్లపై దుమ్మెత్తిపోశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను నియమించడంపై షబ్బీర్ అలీ తీవ్రంగా తప్పు పట్టారు. గోదావరి నీళ్లు తాము తీసుకువస్తే ఇప్పుడు తండ్రీ కొడుకులు నెత్తిమీద చల్లుకుంటూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తెలంగాణ సొమ్ము ఇతరులకు దోచిపెడుతున్నారని ఆయన కెసిఆర్, కెటిఆర్లను ఉద్దేశించి అన్నారు. నవంబర్ 8 బ్లాక్ డే అని, ప్రధాని నరేంద్ర మోడీకి సంసారం గురించి తెలియదని అన్నారు. బాధ్యత తెలియని వ్యక్తి ప్రధాని అని షబ్బీర్ అన్నారు. 180 అబద్ధాలు ఆడిన చిన్న మోడీ అంటూ కేసీఆర్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.