టీఎస్పీఎస్సీలో ముస్లింలకు స్థానం లేదా.?సభ్యుల ఎంపికలో సమన్యాయం లేదని షబ్బీర్ ఆగ్రహం.!
హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ముస్లిం వర్గానికి చెందిన అభ్యర్ధిని సభ్యుడిగా చేర్చకపోవడాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణలో మొత్తం జనాభాలో ముస్లింలు దాదాపు 14 నుంచి 15 శాతం వరకూ ఉన్నారని, దాదాపు 90% ముస్లిం యువత నిరుద్యోగులుగా ఉన్నారని షబ్బీర్ ఆలీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న పలు నియామకాల్లో జనాభా ప్రాతిపదికన ముస్లింలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు షబ్బీర్ ఆలీ.
టీఎస్పీఎస్సీలో సమన్యాయం జరగలేదు.. ముస్లింలను కేసీఆర్ పరిగణలోకి తీసుకొలేదన్న షబ్బీర్ అలీ
2004 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్ల కోటా సక్రమంగా అమలు అవుతుందో లేదో చూసేందుకు టీఎస్పీఎస్సీలో ముస్లిం సభ్యుడి నియామకమే రుజువుచేస్తోందని షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. ఏదేమైనా, ప్రభుత్వ ఉద్యోగాలలో కొనసాగుతున్న 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోటాను ఆపాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కోరుకుంటున్నారని ఎద్దేవా చేసారు. అందులో భాగంగానే టీఎస్పీఎసీసీలో సభ్యుడిగా ఒక్క ముస్లింకు కూడా అవకాశం ఇవ్వలేదని షబ్బీర్ అలీ ఆరోపించారు.
12శాతం రిజర్వేషన్ ఏమైంది.?సూటిగా ప్రశ్నించిన కాంగ్రెస్ నేత..
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో తెలంగాణ ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ల కోటా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చి ఏడున్నర సంవత్సరాల తర్వాత కూడా నేటికీ అమలు చేయలేదని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏడున్నర సంవత్సరాల తరువాత కూడా ఆ హామీని నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు షబ్బీర్ ఆలీ. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడతానంటూ ఎన్నో అవాస్తవ హామీలు ఇస్తూనే ఉన్నారని మండిపడ్డారు.
ముస్లింల 4 శాతం రిజర్వేషన్ల కోటా రద్దుకు కేసీఆర్ కుట్ర.. షబ్బీర్ అలీ ఘాటు విమర్శలు..
ఇదిలా ఉండగా టీఎస్పీఎస్సీ సభ్యునిగా పనిచేయడానికి అర్హత ఉన్న ఒక్క మైనార్టీ సభ్యుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపించలేదా అని షబ్బీర్ సూటిగా ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీకి విధేయులుగా ఉన్న ముస్లింలు ఈ అంశం పట్ల సీఎం ను నిలదీయాలని షబ్బీర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఇప్పుడు బహిరంగంగా మైనారిటీ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని, టీఎస్పీఎస్సీకి 2014లో ఏర్పాటు చేసిన బోర్డు సభ్యుల్లో ఒక ముస్లిం సభ్యుడికి అవకాశం ఉండేదని, ఇప్పుడు బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ముస్లింకు అవకాశం ఇవ్వలేదని తీవ్రస్దాయిలో ఆరోపించారు.
నిరుద్యోగ భృతి చెల్లించాలి.. పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు పారదర్శకంగా పూర్తి చేయాలన్న షబ్బీర్..
అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి 2014 నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మద్దతు చెబుతూనే ఉన్నారని షబ్బీర్ ఆలీ చెప్పుకొచ్చారు. 2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో సగానికి పైగా ప్రొఫెషనల్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు మూతపడుతున్నాయని, ఇదొక క్రమపద్ధతిలో మైనార్టీ యువతను విద్యకు దూరం చేసేందుకు గులాబీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని షబ్బీర్ ఘాటుగా విమర్శించారు.