రాజకీయ వ్యూహం: అమిత్ షా ఆడే ఆటలో అరటిపండు.. కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి తెలియనివారుండరు. ఒకప్పుడు ఆయన కోసం పలు దేశాల అధ్యక్షులు కూడా ఎదురు చూసేవారనేది అతిశయోక్తి కాదు. అటువంటి పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగిన తర్వాత ఆయన స్టేచర్ మారిపోయింది. సీరియస్ గా సాగుతున్న రాజకీయంలో రిలాక్సేషన్ కోసం పాల్ను ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు.
తెలంగాణలో ఎలాగైనా ఈసారి పాగా వేయాలనే వ్యూహంతో ఉన్న భారతీయ జనతాపార్టీ పెద్దలకు ఇప్పుడు కేఏ పాల్ దొరికారు. అమిత్ షా వ్యూహాలు కూడా బాగా పనిచేస్తాయనే పేరుంది. అందుకే ఆయన పాల్ను పావుగా ఉపయోగించుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఓటును చీల్చడానికి ఉండే ఎటువంటి అవకాశాలను వదులుకోకూడదనే పట్టుదలను ప్రదర్శిస్తున్న బీజేపీ పెద్దలు తెలంగాణ సర్కారుకు మద్దతిస్తున్న క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను చీల్చడానికి కేఏ పాల్ను ఉపయోగిస్తున్నారు.

నియోజకవర్గానికి 500 ఓట్లు
పాల్ మాట్లాడే మాటలు రాజకీయం వరకు హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన బోధనలు మాత్రం అద్భుతస్థాయిలో ఉంటాయి. ఆయన మత ప్రచారకుడు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఆయనంటే ఆరాధనా భావం కలిగినవారు ఉంటారని, నియోజకవర్గానికి 500 ఓట్లు చీల్చినా ఉపయోగపడతాయనే భావనలో బీజేపీ నేతలున్నారు.

అడగ్గానే అపాయింట్మెంట్
తెలంగాణలో పరామర్శ యాత్రలు చేస్తున్న పాల్పై టీఆర్ ఎస్ శ్రేణులు దాడిచేశాయి. తనపై దాడిజరిగిందని ఫిర్యాదు చేయడానికి అపాయింట్మెంట్ అడగ్గానే అమిత్ షా
ఇచ్చేశారు. తెలంగాణలోనే తిరుగుతూ, తెలంగాణలోనే ప్రచారం చేస్తానని, రూ.7,50 లక్షల అప్పులు చేసిన తెలంగాణ సర్కారు మనుగడ ఎలా సాధ్యమవుతుందని, ఆ డబ్బంతా కేసీఆర్, కేటీ ఆర్ ఏం చేశారని పాల్ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణపైనే దృష్టిసారిచిన పాల్
గత ఎన్నికల్లో ఏపీలో పోటీచేసిన పాల్ ఈసారి కేవలం తెలంగాణపైనే దృష్టిసారించినట్లున్నారు. అందుకే ఆయన పరామర్శ పేరుతో యాత్రలు చేస్తూ టీఆర్ ఎస్పై నిప్పులు చెరుగుతున్నారు. ఆయన వెనక బీజేపీ ఉందనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతోందని, ఇటువంటి కుయుక్తులు ఎన్ని పన్నినా ప్రజాబలం తమవైపే ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications