వేములవాడ రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా నేటినుండి శివ కళ్యాణోత్సవాలు!!
దక్షిణ కాశీగా పేరొందిన తెలంగాణా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నేడు మార్చి 27 నుండి మార్చి 31 వరకు శివ కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివ కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించటం కోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రాంగణంలో యాగశాలను సిద్ధం చేశారు.
అయిదు రోజుల పాటు నిర్వహించే శివ కల్యాణోత్సవ వేడుకలకు ఆలయం లోపలు, మామిడి, అరటి తోరణాలతో అలంకరణ చేశారు. శివ కళ్యాణోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, వేసవి కావటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఆలయ ప్రాంగణంలో పెద్దఎత్తున చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈరోజు శివ కళ్యాణోత్సవాలలో తొలిరోజు ఉదయం 8.05 గంటలకు ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.

ఉదయం పుణ్యాహవాచనం నిర్వహించారు. ఆపై నేడు సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, శివ మహాపురాణ ప్రవ చనం నిర్వహిస్తారు. రాత్రి భేరీ పూజ దేవతాహ్వాన, మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడతారు. 28న ఉదయం 10.50 నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు శ్రీ పార్వతి రాజరాజేశ్వరి స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో వైభవంగా నిర్వహించనున్నారు.
29న తీర్థ రాజస్వామి పూజ ఆవాహిత దేవతార్చన, బలిహరణం, ఔపాసనం, కళ్యాణ మండపంలో రాత్రి సదస్యం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 30న సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 31న పూర్ణాహుతి, క్షేత్రపాలక బలి, ధర్మగుం డంలో త్రిశూలయాత్ర, రాత్రి ఏకాదశ ఆవరణములు నిర్వహించి ఆపై ఏకాంత సేవతో ఉత్సవాలు ముగిస్తారు.
ఈ వేడుకలను తిలకించటానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు వేములవాడకు తరలివస్తారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శివ కళ్యాణోత్సవాలు తిలకించి తరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications