జగన్ పార్టీని కూడా పిలవండి: కేసీఆర్కు కోర్టు ఝలక్, వీసీలపై ఊరట
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు పైన ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించక పోవడంపై కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో సోమవారం నాడు షాక్ తగిలింది. వైసిపిని కూడా అఖిల పక్ష భేటీకి పిలవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ఇందుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల పునర్విభజన అంశంపై జరిగిన అఖిల పక్ష సమావేశానికి తెలంగాణ వైసిపిని ఆహ్వానించలేదని ఆ పార్టీ నేత శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆయన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం సోమవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల పునర్విభజన పైన జరిగిన అఖిల పక్షానికి వైసిపిని ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైసిపి అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంకుబండ్ పైన అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
తెలంగాణకు సుప్రీం కోర్టులో ఊరట
సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి సోమవారం నాడు తాత్కాలిక ఊరట లభించింది. కేసు పూర్తయ్యే వరకు కొత్త వీసీల కొనసాగింపుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకారం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్, విశ్వనాథ శెట్టిలు వాదనలు వినిపించారు. కాగా, వీసీల నియామకాన్ని కోర్టు ఇటీవల తప్పు పట్టింది.